Monday, February 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇది కార్పొరేట్ల వికాస్‌ బడ్జెట్‌ : సీఐటీయూ

ఇది కార్పొరేట్ల వికాస్‌ బడ్జెట్‌ : సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టింది కార్పొరేట్ల వికాస్‌ బడ్జెట్‌ అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌ విమర్శించారు. ఆదివారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర బడ్జెట్‌ పూర్తిగా కార్పొరేట్ల లాభాలు, ప్రయోజనాల కోసమే రూపొందించినట్టుగా ఉందని విమర్శించారు. ఈ బడ్జెట్‌లో సంపద సృష్టికర్తలైన కార్మికుల ప్రస్తావనే లేదని ఎత్తిచూపారు. ప్రజల కొనుగొలు శక్తి పెంచే చర్యలు, కనీసవేతనాల నిర్ణయం, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం, యువతకు ఉపాధి, ధరల స్థిరీకరణ వంటి మౌళిక సమస్యల్ని బడ్జెట్‌ పట్టించుకోలేదని విమర్శించారు. సంస్కరణల పేరుతో ప్రయివేటీకరణను వేగం చేసే చర్యలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ను కార్మికులు, రైతులు, పేదలు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలపై భారాల మోపే విధంగా రూపొందించారని విమర్శించారు. దాన్ని ప్రజా అనుకూల బడ్జెట్‌గా సవరించాలని డిమాండ్‌ చేస్తూ పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ బడ్జెట్‌లో కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయల ఇన్‌ఫ్రాÛస్ట్రక్చర్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాజెక్టులను కట్టబెట్టిందని ఎత్తిచూపారు. కార్పొరేట్‌ పెట్టుబడులకు పన్నుల్లో స్థిరత్వం, రాయితీలు, సడలింపులను ప్రకటించడం దారుణమని పేర్కొన్నారు. ఉపాధి సృష్టి పేరుతో శాశ్వత ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్టు, గిగ్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉపాధినీ పెంచే బడ్జెట్‌. కార్మికులకు ఉద్యోగ భద్రత, ఉపాధి హామీ, కనీస వేతనాల పెంపు, అసంఘటితరంగ కార్మికులు, స్కీం వర్కర్లకు సంబంధించి సామాజిక భద్రత అయిన పెన్షన్‌, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ లాంటి వాటి అమలుపై ప్రస్తావన లేదని తెలిపారు. లేబర్‌ కోడ్‌లతో నష్టపోతున్న కార్మికుల బాగు కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ బడ్జెట్‌ అసమానతల్ని పెంచేదిగా ఉందనీ, ఇది ఉపాధి రహిత బడ్జెట్‌ అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -