నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం లారెడో నగర జాతీయ రహదారిపై ఒక ప్రైవేట్ విమానం కుప్పకూలింది. ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానం లూప్ 20 రహదారిపై పడిపోగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానం మంటల్లో చిక్కుకున్న సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు స్పందించి, ప్రాణాలకు తెగించి రక్షణ చర్యలు చేపట్టారు. విమానం పేలిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ వెనకడుగు వేయకుండా, లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు వారు చేసిన సాహసోపేత ప్రయత్నాలు ఇప్పుడు అందరినీ కదిలిస్తున్నాయి.
మెక్సికో నుంచి టెక్సాస్లోని ఆస్టిన్ నగరానికి వెళ్తుండగా సాంకేతిక లోపాలు తలెత్తడం, ఇంధనం అయిపోవడంతో విమాన సిబ్బంది లారెడో అంతర్జాతీయ విమానాశ్రయం వైపు మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే రన్వేకు కొద్ది దూరంలోనే విమానం నియంత్రణ కోల్పోయి రహదారిపై ఉన్న విద్యుత్ స్తంభాలను, ఒక వాహనాన్ని ఢీకొట్టి రెండు ముక్కలైంది. ఈ ఘోర ప్రమాదంలో ఆస్టిన్కు చెందిన ‘క్యాపిటల్ ఫ్యాక్టరీ’ స్టార్టప్ అధినేత జోషువా బేర్ అక్కడికక్కడే మరణించారు. విమానంలో ఉన్న మిగిలిన ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.



