నవతెలంగాణ – హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో టీజీ 20 లీగ్ ఆరంభ వేడుకలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రముఖ సినీనటుడు, లీగ్ బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టీజీ-20 క్రికెట్ లీగ్ మంచి కార్యక్రమమని అన్నారు. ప్రభుత్వం నుంచి దీనికి పూర్తి సహకారం ఉంటుందని ఆయన చెప్పారు.
అనంగరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. టీజీ-20 లీగ్లో భాగస్వామ్యం కావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో అంతర్జాతీయ క్రికెట్లో హైదరాబాద్ నుంచి తక్కువ మంది ఉండేవాళ్ళని, హైదరాబాద్ నుంచి వెళ్లిన వీవీఎస్ లక్ష్మణ్ను చూసి మేమెంతో గర్వపడేవాళ్లమని చెప్పారు. నగరంలో ఇలాంటి లీగ్ జరగడం వల్ల ఎంతో మందికి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది.



