Monday, February 23, 2026
E-PAPER
Homeదర్వాజవిశిష్ట కథాశిల్ప కళాపూర్ణోదయం

విశిష్ట కథాశిల్ప కళాపూర్ణోదయం

- Advertisement -

తెలుగు సాహిత్య చరిత్రలో కొన్ని కావ్యాలు కేవలం కథలుగా మాత్రమే కాకుండా, సాహిత్య పరిణామాన్ని మలుపు తిప్పిన రచనలుగా నిలుస్తాయి. అలాంటి అపూర్వ కావ్యాలలో పింగళి సూరణ రచించిన ‘కళాపూర్ణోదయం’ ఒకటి. ఇది అద్భుత కథగా మాత్రమే కాకుండా, కథా నిర్మాణం, కథన శైలి, పాత్ర చిత్రణ, తాత్విక భావనల సమన్వయంతో రూపొందిన ఒక ప్రయోగాత్మక మహాకావ్యంగా గుర్తింపు పొందింది. పురాణ ఇతిహాసాల ఆధారంతో సాగిన సంప్రదాయ ప్రబంధాల మధ్య పూర్తిగా కవి కల్పనపై ఆధారపడి రూపొందిన కావ్యం కావడం వల్ల, కళాపూర్ణోదయం తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట స్థానం సంపాదించింది.

పింగళి సూరణ కాలం నాటికి తెలుగు ప్రబంధ సంప్రదాయం బలంగా స్థిరపడింది. మనుచరిత్ర, వసుచరిత్ర వంటి కావ్యాలు కథా పరంగా, శిల్ప పరంగా ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాయి. అయితే ఈ కావ్యాలన్నీ పురాణాలపై ఆధారపడినవే. సూరణ మాత్రం ఈ సంప్రదాయాన్ని దాటి, పూర్తిగా స్వతంత్ర కథా కల్పనతో కళాపూర్ణోదయాన్ని రచించాడు. ఈ ధైర్యమే అతన్ని సాధారణ కవుల కంటే భిన్నంగా నిలబెట్టింది. ఒకవైపు సంప్రదాయ పద్యరచనలో పట్టు, మరోవైపు కొత్త కథన ప్రయోగాల పట్ల ఆసక్తి ఈ రెండింటి సమ్మేళనం సూరణ సాహిత్య ప్రతిభకు ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. కళాపూర్ణోదయం కథను సరళ రేఖీయ పద్ధతిలో చెప్పడు. కథ ప్రారంభం, మధ్య, ముగింపు అన్న సంప్రదాయ నిర్మాణాన్ని పక్కన పెట్టి, కాలాన్ని ముందుకు-వెనక్కు తిప్పుతూ కథను విస్తరిస్తాడు. కథలో కథలు ప్రవేశపెట్టడం ద్వారా పాఠకుడిని ఒక సంఘటన నుండి మరో సంఘటనకు సహజంగా తీసుకెళ్తాడు. ఈ విధానం పాఠకున్ని కేవలం వినేవాడిగా కాకుండా, ఆలోచించేవాడిగా మార్చుతుంది. ఆధునిక సాహిత్యంలో దీనిని non-linear narration అంటారు. అయితే సూరణ ఈ ప్రయోగాన్ని ఆధునిక కాలానికి శతాబ్దాల ముందే చేసి చూపించాడు. అందువల్ల కళాపూర్ణోదయం కథనం తన కాలాన్ని మించిన దష్టిని ప్రతిబింబిస్తుంది.

ఈ కావ్యంలో కథన శైలి ఎంత ముఖ్యమో, అంతే ముఖ్యమైనది పద్య రూపంలో కథను నడిపిన విధానం. సూరణ పద్యాన్ని అలంకారంగా మాత్రమే ఉపయోగించలేదు. సంభాషణలు, భావోద్వేగాలు, మానసిక సంఘర్షణలు, కథా మలుపులు…. అన్నీ పద్య రూపంలోనే సజీవంగా చిత్రించాడు. ఇది అత్యంత కఠినమైన సాహిత్య సాధన. పద్యం కథను నడిపించే సాధనంగా మారినప్పుడు, కవికి భాషపై, ఛందస్సుపై అపారమైన పట్టు అవసరం. సూరణలో ఈ పట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే కళాపూర్ణోదయం చదువుతున్నప్పుడు పద్యబరువు అనిపించదు. కథ స్వయంగా ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తుంది. కళాపూర్ణోదయంలో పాత్ర చిత్రణ మరో ముఖ్యమైన విశేషం. ముఖ్యంగా కళాభాషిని పాత్ర తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం పొందింది. ఆమె వేశ్య అయినప్పటికీ, కవి ఆమెను కామానికి ప్రతీకగా చూపించడు. ప్రేమ, త్యాగం, మానవీయ విలువలకు ఆమె ప్రతిరూపంగా నిలుస్తుంది. ఆమె ప్రేమ స్వార్థరహితం. ఆమె త్యాగం పరమార్థభరితం. అప్పటి సమాజంలో వేశ్యల పట్ల ఉన్న దష్టికోణాన్ని దాటి, ఒక స్త్రీని వ్యక్తిగా, స్వతంత్ర ఆలోచన గల మానవిగా చిత్రించడం సూరణ ఆధునిక దష్టికి నిదర్శనం. ఈ పాత్ర ద్వారా సూరణ స్త్రీల పట్ల తన ఉదాత్త భావనను వ్యక్తం చేశాడు.

ఇతర పాత్రలు కూడా కేవలం కథను ముందుకు నడిపే సాధనాలుగా కాకుండా, మానవ స్వభావాల ప్రతిబింబాలుగా కనిపిస్తాయి. నలకుబేరుడు, మణికంధరుడు, నారదుడు వంటి పాత్రల ద్వారా అహంకారం, మోహం, ఈర్ష్య, అనుమానం వంటి భావాలు ఎలా మనిషిని పతన దిశగా నడిపిస్తాయో సూరణ స్పష్టంగా చూపించాడు. దేవతలు కూడా ఈ మానవ లక్షణాల ప్రభావానికి లోనవుతారని చూపడం ద్వారా, సూరణ మానవ-దైవ సంబంధాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించాడు. కళాపూర్ణోదయంలో తాత్విక లోతు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రూపం, సత్యం మధ్య ఉన్న వ్యత్యాసం ఈ కావ్యంలో ప్రధాన తాత్విక అంశంగా నిలుస్తుంది. రూపం మాయను సష్టిస్తుంది. సత్యం మాత్రం ఆ మాయను ఛేదిస్తుంది. మాయారంభ, మాయానకుబేరుడు వంటి భావనలు ఈ తాత్విక విచారణకు ప్రతీకలుగా నిలుస్తాయి. మనిషి కళ్లకు కనిపించేదే నిజమని భావిస్తే, అది మోసానికి దారి తీస్తుందని సూరణ హెచ్చరిస్తాడు. ఈ తాత్విక భావన భారతీయ దర్శన సంప్రదాయానికి అనుసంధానంగా ఉన్నప్పటికీ, కథా రూపంలో సులభంగా పాఠకునికి చేరుతుంది. వరాలు-శాపాలు కూడా ఈ కావ్యంలో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. దేవతలిచ్చే వరాలు కూడా మనిషి కోరికల వల్లే శాపాలుగా మారతాయని సూరణ సూచిస్తాడు. వరం స్వయంగా మంచిదో చెడ్డదో కాదు. దానిని వినియోగించే మనిషి మనస్తత్వమే దాని ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఈ భావన ద్వారా సూరణ నియతి మరియు మానవ స్వేచ్ఛ మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషిస్తాడు. దైవ సంకల్పం ఒకవైపు ఉంటే, మానవ కోరికలు మరోవైపు ఉంటాయి. ఈ రెండింటి సంఘర్షణే జీవన గమనాన్ని మలుపు తిప్పుతుంది.

కళాభాషిని త్యాగం ద్వారా సూరణ పరోపకార భావనను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తాడు. ఆమె త్యాగం వ్యక్తిగత ప్రేమకే పరిమితం కాదు. అది ఇతరుల మేలుకోసం చేసిన త్యాగం. ఈ త్యాగమే ఆమెను ఉన్నత స్థాయికి చేర్చుతుంది. పరోపకారమే మోక్షానికి మార్గమనే భావన భారతీయ తాత్విక సంప్రదాయంలో కీలకమైనది. సూరణ ఈ భావనను కథా రూపంలో సులభంగా, హద్యంగా ప్రతిపాదించాడు. కళాపూర్ణోదయం కావ్యం యొక్క మరో విశేషం కథకు ఉన్న మానసిక లోతు. పాత్రలు కేవలం బాహ్య సంఘటనలతో కాకుండా, అంతర్మథనాలతో కూడా జీవిస్తాయి. అనుమానం, ఆశ, భయం, ప్రేమ, త్యాగం…. ఈ భావాలన్నీ పాత్రల మనస్సుల్లో జరిగే సంఘర్షణల రూపంలో వ్యక్తమవుతాయి. ఈ మానసిక విశ్లేషణ సూరణను సాధారణ కథకుడి స్థాయి నుండి గొప్ప సాహిత్య శిల్పిగా ఎత్తిచూపుతుంది. ఈ అన్ని అంశాల సమ్మేళనమే కళాపూర్ణోదయాన్ని ఒక సాధారణ అద్భుత కథగా కాకుండా, ఒక సాహిత్య ప్రయోగంగా నిలబెట్టింది. కథలో అద్భుతం ఉన్నా, అది కేవలం వినోదం కోసం కాదు. భావోద్వేగం, తాత్వికత, నైతిక విలువలు అన్నీ కలసి కథకు గంభీరతను అందిస్తాయి. అందుకే ఈ కావ్యం చదువుతున్నప్పుడు పాఠకుడు కేవలం కథను అనుభవించడు, జీవితం, మానవ స్వభావం గురించి ఆలోచించక తప్పదు. కళాపూర్ణోదయం పింగళి సూరణ సాహిత్య ప్రతిభకు అద్దంలాంటిది. కథా నిర్మాణంలో వైవిధ్యం, కథనంలో ధైర్యం, పాత్రల్లో మానవీయ లోతు, భావంలో తాత్విక గంభీరత ఈ నాలుగూ కలిసి ఈ కావ్యాన్ని తెలుగు సాహిత్యంలో ఒక అపూర్వ రచనగా నిలబెట్టాయి. సూరణను కేవలం మహాకవిగా మాత్రమే కాకుండా, తన కాలాన్ని మించిన కథన శిల్పిగా, సాహిత్య ప్రయోగవేత్తగా గుర్తించడానికి కళాపూర్ణోదయం ప్రధాన ఆధారంగా నిలుస్తుంది.

కర్నె మల్లికార్జున్‌, 6303744239

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -