నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు చిత్రసీమలో మరో ప్రేమ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఒకటయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా, ఒకప్పటి రాచరికపు వైభవాన్ని తలపించే ప్యాలెస్లో నిన్న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.
పెండ్లి జరిగిన కొన్ని గంటల్లోనే ఈ కొత్త జంట తమ వివాహ చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “కొత్త ప్రయాణం మొదలైంది” అంటూ వారు పెట్టిన పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పెండ్లి ముగిసిన వెంటనే ఈ జంట నేరుగా ఢిల్లీకి చేరుకోవడం విశేషం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను విజయ్, రష్మిక ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా అమిత్ షాకు గణపతి విగ్రహాన్ని బహూకరించి, తమ వివాహ రిసెప్షన్కు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు.
మార్చి 4వ తేదీన హైదరాబాద్లో విజయ్, రష్మిక రిసెప్షన్ ఏర్పాటు చేశారు. తాజ్ కృష్ణలో 4వ తేదీన సాయంత్రం 7 గంటలకు రిసెప్షన్ ప్రారంభమవుతుంది. ఈ రిసెప్షన్ కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.



