Sunday, March 1, 2026
E-PAPER
Homeకవర్ పేజీవన్యజీవులతోనే... పర్యావరణ మనుగడ

వన్యజీవులతోనే… పర్యావరణ మనుగడ

- Advertisement -

భూమ్మీద గత కొంత కాలంగా యదేచ్ఛగా సాగుతున్న పర్యావరణ వినాశనానికి, జీవ వైవిధ్య విధ్యంసానికి మానవుడే కారణం. పారిశ్రామిక యుగం ప్రారంభమయిన తర్వాత పర్యావరణ కాలుష్యం అత్యంత వేగవంతంగా విస్తరిస్తూ వస్తుంది. భూమ్మీద సంభవిస్తున్న పర్యావరణ సమస్యలన్నింటికీ మానవుడే కారణమనటం కూడా సరికాదు. కానీ పర్యావరణం ఎదుర్కొంటున్న అనేక ప్రమాదకర పరిణామాలకు మాత్రం మానవుడే ప్రధాన కారణమని మాత్రం చెప్పవచ్చు.
(మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణా దినోత్సవం)

ప్రకృతిలో జరిగే అనేక సహజచర్యల వల్ల కలుషితాలు విడుదలవుతాయి, కానీ వాటి వల్ల కలిగే దుష్పలితాల నుండి ప్రకృతి తనంతంట తాను బయటపడే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. దీన్నే ప్రకృతి పునర్జీవనశక్తి అంటారు. కానీ మానవుని చర్యలు వల్ల నిత్యం పర్యావరణంలోకి వెదజల్లబడుతున్న కలుషితాల వల్ల కలిగే అనర్ధాల నుండి తిరిగి కోలుకునే శక్తిని ప్రకృతికి కోల్పోతుంది. ప్రకృతి తిరిగి కోలుకోలేనంతగా వ్వర్ధాలు నిరంతరం పర్యావరణంలోకి వెదజల్లబడుతున్నాయి. ప్రకృతి పునర్జీనశక్తికి, పర్యావరణ విధ్వంసక కలుషితాల సామర్ధ్యానికి జరిగే పోరులో ప్రకృతి ఎప్పుడూ ఓటమి పాలవుతూనే ఉంది. ప్రకృతి నేడు ఎదుర్కొంటున్న సంక్షోభస్థితే ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల మనగడతో పాటు, సమస్త జీవరాశి మనుగడకు మరణశాసనంగా పరిణమిస్తుంది. వేగంగా విస్తరిస్తున్న పర్యావరణ సంక్షోభాన్ని నివారించి, పర్యావరణ వ్యవస్థలను తిరిగి పూర్వస్థితికి తీసుకురాకపోతే రానున్న రోజల్లో జీవ వైవిధ్యం మరింత ధ్యంసమయ్యే అవకాశముంది.
ఆధునిక మానవుని అనాలోచిత చర్యల వల్ల భూమ్మీద నివశిస్తున్న కోట్లాది జీవరాశుల మనుగడ నేడు ప్రశ్నార్ధకంగా మారింది. అభివృద్ధి పేరుతో మానవుడు చేపడుతున్న చర్యల వల్ల వాతావరణంలో సంభవిస్తున్న మార్పులే జీవుల పాలిట శాపాలుగా మారాయి. నిత్యం పెద్దయెత్తున్న వాతావరణంలోకి వెదజల్లబడుతున్న కలుషితాలు, వేగవంతమవుతున్న అడవులు క్షీణత, అవసరానికి మించి సహాజ వనరులను పెద్దయెత్తున్న వినియోగించుకోవటం, విచ్చలవిడిగా వాడతున్న క్రిమి సంహారకాల వల్ల వేలాది జీవులు అంతరించిపోయాయి. మరికొన్ని అంతరించి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. మానవ మనుగడలోనే కాకుండా పర్యావరణ రక్షణా వ్యవ్ణస్థలలో ఎంతో కీలకమైన పాత్రను పోషించిన వన్యప్రాణులు గతంలో ఎన్నడూ లేనంత గడ్డు స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ వన్యప్రాణులను రక్షించకునే దిశలో ప్రపంచ దేశాలన్నీ ఒక్కటిగా పని చేయాలని కోరుతూ, వన్యప్రాణల రక్షణే ధ్యేయంగా ఐక్యరాజ్యసమితి 1973 మార్చి 3వతేదిన ‘కన్వెన్షన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఇన్‌ ఎండెంజరడ్‌ స్పీసీస్‌ ఆఫ్‌ వైల్డ్‌ ఫానా అండ్‌ ఫ్లోరా (సిఐటిఇఎస్‌) అనే ఒప్పందాన్ని తయారు చేసింది. ఏటా సిఐటిఇఎస్‌ ఒప్పందాన్ని గుర్తు చేసుకుంటూ మార్చి 3న ప్రపంచదేశాలన్నీ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సనాన్ని జరుపుకోవాలని ప్రపంచ దేశాలను కోరింది. దీనిలో భాగంగా 2026వ సంవత్సరానికి సంబంధించిన ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ‘ ఔషద మరియు సుగంధ మొక్కలు… ఆరోగ్యం, వారసత్వం మరియు జీవనోఫాది’ అనే థీమ్‌తో జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచదేశాలను కోరింది.



ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం ఎదుర్కొంటున్న సంకటస్థితి వల్ల భూమ్మీద నివశిస్తున్న కోట్లాది జీవుల మనుగడ తీవ్ర ప్రభావానికి గురవుతుందని, అంతరించిపోతున్న జీవజాతులను రక్షించడానికి ప్రకృతి నుండే పరిష్కార మార్గాలను కనుగొనడానికి అన్ని దేశాలు సమిష్టిగా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచదేశాలను కోరుతుంది. భూమ్మీద అన్ని ఆవరణవ్యవస్ధలలోను కలిపి మొత్తం 140 మిలియన్‌ జీవజాతులు నివశిస్తున్నాయని, వాటిలో కేవలం 1.74 మిలియన్‌ జాతులను మాత్రమే మానవుడు గుర్తించటం జరిగిందని గ్లోబల్‌ బయోడైవర్సిటీ ఔట్‌లుక్‌ తాజా నివేదిక తెలియచేస్తుంది. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ ఏటా ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జాతులపై తాజాగా విడుదల చేసిన ఒక నివేదికను అనేక చేదు నిజాలను వెల్లడించింది. ఐయుసిఎన్‌ రెడ్‌డేటా బుక్‌ అధ్యయనం ప్రకారం 18వేల జాతులను పరిశీలించగా, వాటిలో 11వేల జీవజాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయని తెలుపుతుంది. ప్రపంచంలో అత్యంత జీవవైవిధ్యం కలిగిన దేశాలలో 7వ స్థానంలో ఉన్న భారతదేశంలో కూడా జీవ వైవిధ్యం వేగవంతంగా ధ్వంసమై పోతుందని అధ్యయనాల వల్ల తెలుస్తుంది. జలాశయాలు అడుగంటి పోవటం, సాగుభూములు తమ సారాన్ని కోల్పోయి ఎడారులుగా మారటం కూడా జీవుల వినాశనానికి ఒక కారణం. గడిచిన దశాబ్దకాలంలో 15 లక్షల హెక్టార్ల సాగుభూమి ఎడారిగా మారిపోయింది. వర్షాభావ పరిస్థితులు, జల వనరులు తగ్గిపోవటం, భూతాపం వల్ల నేలలోని మూలకాలు నశించిపోవటం వల్ల వేలాది ఎకరాల సాగుభూమి ఎడారీకరణ వేగంగా విస్తరిస్తుంది. ఇది రానున్న రోజులలో ఆహార సంక్షోభానికి కారణమవ్వటంతో పాటు, వేలాది జీవుల నిరాశ్రయులను చేస్తుంది. అదే జరిగితే జీవ సమతుల్యతను కాపాడుతున్న జీవవైవిధ్యం పెద్దయెత్తున్న ధ్వంసమయ్యే అవకాశముంది.


సమస్త జీవరాశికి ప్రాణవాయువులు అందించిన అడవులు నేడు తమ ఆయువును కోల్పోయే దుస్థితిని ఎదుర్కొంటున్నాయి, దీని వల్ల కూడా ప్రపంచ వ్యాప్తంగా వన్య జీవుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. అత్యంత పురాతనమైన జీవవైవిధ్య కేంద్రాలుగా పరిఢవిల్లిన అరణ్యాలు నేడు జీవరహిత కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఇదే విధానం ఇలాగే కొనసాగితే అడవులను కోల్పోయిన భూమి బిడ్డల్ని కోల్పోయిన గొడ్రాళ్లుగా మారిపోక తప్పదు. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి ఏటా వేలాది ఎకరాల్లో అడవులు నరికివేతకు గురవుతున్నాయి. మానవుని ఆహార, ఆవాస అవసరాలతో పాటు, పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి నిత్యం వేల ఎకరాల్లో అడవులను ధ్వంసం చేస్తున్నారు. పారిశ్రామికీకరణ, నగరీకరణ, ప్రాజెక్టుల నిర్మాణం, రైల్వే, రోడ్డు నిర్మాణాల వంటి కార్యక్రమాల వల్ల ప్రపంచవ్యాప్తంగా అడవులన్నీ ధ్వంసమైపోతున్నాయి. 1990 నుండి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 420 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవులు అంతరించిపోయాయని గ్లోబల్‌ ఫారెస్ట్‌ అసెస్‌మెంట్‌ తాజా నివేదిక తెలియచేస్తుంది. మానవుని స్వార్ధపూరిత చర్యల వల్ల ప్రతి సంవత్సరం 10 మిలియన్‌ హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవులు అంతరించిపోతున్నాయి. పర్యావరణాన్ని రక్షించాల్సిన ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయకపోవటం వల్లే అడవులు నేడు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నాయని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వేలాది ఎకరాల్లో ఉన్న అటవీ భూములను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టటం వల్ల ఆ అడవుల మీద ఆధారపడి బతికే జీవులు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. దీనిని అరికట్టకపోతే జీవ మనుగడతో పాటు, మానవ మనగడ కూడా ప్రమాదంలో పడే అవకాశముంది.

పారిశ్రామిక రంగం నుండి, గృహ సముదాయాల నుండి నిత్యం పర్యావరణంలోకి విడుదలవుతున్న కాలుష్యం వల్ల భూమ్మీద ఉష్ణోగ్రతలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. కాలుష్యం కన్నా పెరుగుతున్న భూతాపమే జీవుల పాలిట శాపంగా మారుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రతిగంటకు పదికిపైగా అరుదైన జీవజాతులు అంతరించి పోతున్నాయని, మానవుడు గుర్తించని వేలాది జీవులు ఇప్పటికే అంతరించిపోయాయని జీవ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పరిస్థితుల ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో 75శాతం పైగా జాతులు అంతరించిపోయే ప్రమాదముందని, రానున్న ఆ మహాప్రళాయాన్నే ఆరవ మహాప్రళయమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటి వరకు సంభవించిన 5 మహాప్రళయాలలో భూమ్మీద నివశిస్తున్న 65 శాతం జీవ జాతులు నామరూపాల్లేకుండా పోయాయని, రానున్న ఆరవ మహప్రళయం వల్ల మానవజాతి కూడా అటువంటి ప్రమాదమే ఎదుర్కొంటుందని వారు హెచ్చరిస్తున్నారు. పాలకులు అవలంభిస్తున్న పారిశ్రామిక విధానాలతో పాటు, ప్రజల జీవన విధానంలో వస్తున్న అనూహ్య మార్పులు కూడా ప్రపంచ మానవాళి నేడు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి ప్రధాన కారణం. సంపన్న దేశాల జీవన విధానం వల్లనే భూతాపానికి కారణమవుతున్న కార్బన్‌ ఉద్గారాల విడుదలకు కారణం. సంపన్న దేశాల నుండి రోజూ పర్యావరణంలోకి విడుదలవుతున్న కర్బన కలుషితాల వల్లే భూమ్మీద ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగిపోతున్నాయి. భూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగటం వల్ల ఒక పక్క సముద్రమట్టాలు పెరుగుతుంటే, మరొక పక్క ధృవ ప్రాంతాలలోని మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. దీనివల్ల సంభవించే జలప్రళయం కోట్లాదిమంది ప్రజలను నిరాశ్రయులను చేయటంతో పాటు, కోట్లాది జీవరాశుల మనుగడకు ప్రమాదం కలుగచేస్తాయి. ఇప్పటికే పర్యావరణ సంక్షోభం వల్ల ఉన్న ఆవాసాలను కోల్పోయి శరణార్ధులుగా మారిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందని పర్యావరణ సంస్ధల యొక్క అధ్యయన నివేదికల ద్వారా తెలుస్తుంది. 2020 నాటికి 50 మిలియన్లు పర్యావరణ శరణార్ధులుగా ఉన్నారని, 2050 నాటికి వీరి సంఖ్య 200 మిలియన్లకి పెరిగే అవకాశముందని ఆ నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాతావరణంలో సంభవించిన మార్పులు వల్ల ఏటా 27వేలకు పైగా జీవజాతులు అంతరించిపోతున్నాయి. గడిచిన శతాబ్దకాలంలో 75శాతం జన్యు ఆహారపంటలు అంతరించిపోయాయి, వందల సంవత్సరాలు మానవాళితో పాటు జీవరాశికి పోషకాహారాన్ని అందించిన పంటలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అరుదైన జీవన వ్యవస్ధలుగా పేర్గాంచిన పగడపు దీవుల ధ్వంసమై పోయాయని, రానున్న రోజులలో ఇదే పరిస్థితి కొనసాగితే 90శాతంపైగా పగడపు దీవులు తమ ఉనికిని కోల్పోతామని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఆహరపు గొలుసులో సంభవించే మార్పులు వల్ల మిగిలిన జీవరాశులకు ఆహారపుకొరత ఏర్పడే అవకాశముంది. మూడవ ప్రపంచదేశాలలో అధికశాతం జీవజాతులు పర్యావరణపరంగా దుర్భలమైన ప్రాంతాలలో జీవిస్తున్నాయంటే, వాటి మనుగడ ఎంతటి విపత్కర పరిస్థితులలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా జీవుల మనుగడకు తీవ్రమైన విఘాతంగా కలిగిస్తున్న భూతాపానికి వివిధ దేశాల నుండి విడుదలవుతున్న కాలుష్య వ్యర్ధాలే కారణం. భూ ఉష్ణోగ్రతను పెంచే కర్బన ఉద్గారాలు, ఇతర కలుషితాలలో 49శాతం ఇంధన వాడకం ద్వారా విడుదలవుతుంటే, 29శాతం పరిశ్రమల ద్వారా, మిగిలిన 27 శాతం వ్యవసాయ రంగంలో ఉత్పన్నమవుతున్న వ్యర్ధాల వల్ల, అడవుల విధ్వంసం వల్ల విడుదలవుతున్నాయని పర్యావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న 20 సంవత్సరాల కాలంలో సుమారు 2 లక్షల 50వేలకు పైగా జీవజాతులు అంతరించి పోయే ప్రయాదాన్ని ఎదుర్కొంటాయని అధ్యయనాల వల్ల తెలుస్తుంది. విశ్వవ్యాప్తంగా జీవులు అంతరించిపోయే ప్రక్రియ రోజు రోజుకి మరింత వేగవంతమవుతుంది. 80వ దశకంలో వారానికి ఒక జీవి అంతరించిపోతే, 90 దశకం నాటికి రోజుకొక జీవి అంతరించిపోయేదని, ప్రస్తుతం ప్రతి గంటకు పదికి పైగా జీవులు అంతరించి పోతున్నాయని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల నుండి జీవజాతులను రక్షించడానికి సత్వరమే ప్రపంచ దేశాలన్నీ ముందుకు రావాలని ఐక్యరాజ్యసమితి వంటి సంస్ధలు కోరుతున్నప్పటికీ అమెరికా వంటి సంపన్న దేశాలు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ పట్ల అమెరికా ఆది నుండి తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూనే ఉంది. అమెరికా వంటి అగ్రదేశాలు అవలంభిస్తున్న ఏకపక్ష విధానాలే మిగిలిన దేశాలలోని వన్యప్రాణుల జీవితాల పాలిట శాపాలుగా మారుతున్నాయని, ఆయా దేశాలు తమ ద్వంద్వ వైఖరికి స్వస్తి పలికి పర్యావరణ పరిరక్షణతో పాటు, జీవ సంరక్షణకు మిగిలిన దేశాలతో కలిపి పనిచేయాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరుతున్నాయి. భారత్‌ మాత్రం సమయం వచ్చిన ప్రతి సందర్భంలోను పర్యావరణ పరిరక్షణ దిశగా తాను చేపట్టబోయే చర్యల పట్ల స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తూనే ఉంది. మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ అగ్రదేశాల వైఖరిలో ఏరకమైన మార్పు లేకపోవటం పర్యావరణ పరంగా అతి పెద్ద విషాదం. ఇటీవల జరిగిన ప్యారీస్‌ సదస్సులో కూడా అమెరికా అదే వైఖరిని ప్రదర్శించింది. భూమ్మీద జరుగుతున్న అన్ని పర్యావరణ నష్టాలకు సంపన్న దేశాలే దోషులుగా చూపించటం సరికాదని, అభివృద్ధి చెందుతున్న దేశాల వల్ల కూడా పర్యావరణానికి పెద్దయెత్తున విఘాతం కలుగుతుందని అమెరికా ఆరోపిస్తుంది. భారత్‌ వంటి దేశాలు అమెరికా వైఖరిని తప్పుబట్టటంతో పాటు ప్రపంచ పర్యావరణానికి పెను నష్టాన్ని కలిగిస్తున్న సంపన్నదేశాలే పర్యావరణ పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చెయ్యాలని కోరుతున్నాయి. దేశాల మధ్య నెలకొన్న ఈ వివాదాస్పద వైఖరిని తగ్గించి అన్ని దేశాలను పర్యావరణ పరిరక్షణ దిశగా అన్ని దేశాలను ముందుకు నడిపించడానికి ఐకాస వంటి సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటిలో ఫలించేలా లేవు. ఇప్పటికైనా ప్రపంచదేశాలు తమ భాద్యతను తెలుసుకుని పర్యావరణ పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేయకపోతే భూమ్మీద జీవరాశుల మనుగడ మరింత ప్రమాదంలో పడుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచదేశాల వైఖరి మారి పర్యావరణ పరిరక్షణకు ఒక్కటిగా ఏకమవుతాయని ఆశిద్దాం…

డా|| కె. శశిధర్‌, 94919 91918

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -