నవతెలంగాణ – హైదరాబాద్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఇక్కడ ‘బాస్’ ఎవరో బాగా తెలుసంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, పశ్చిమాసియా దేశాల వ్యూహాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు పొడసూపిన నేపథ్యంలో.. బంధాన్ని పునర్నిర్మించుకునేందుకు నెతన్యాహు వచ్చే వారమే వైట్ హౌస్ను సందర్శించే అవకాశం ఉందని ట్రంప్ శనివారం వెల్లడించారు. ‘యాక్సియోస్’ వార్తాసంస్థకు ఇచ్చిన సంక్షిప్త టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. తమ మధ్య సంబంధాలు బాగున్నాయని, అయితే అసలు బాస్ ఎవరో నెతన్యాహుకు స్పష్టంగా తెలుసని వ్యాఖ్యానించారు.
శ్వేతసౌధంలో సమావేశం కావాలని నెతన్యాహు స్వయంగా కోరారని, నాటో సదస్సు ముగించుకుని తాను తిరిగి వచ్చిన తర్వాత ఈ భేటీ ఉండవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ఇరాన్పై ఉమ్మడి యుద్ధాన్ని ప్రకటించే ప్రణాళికను నెతన్యాహు ప్రవేశపెట్టిన తర్వాత.. వీరి మధ్య జరగనున్న మొదటి అధికారిక సమావేశం ఇదే కానుంది. అయితే ట్రంప్ పర్యటనల షెడ్యూల్ దృష్ట్యా వచ్చే వారం చాలా తర్వాత కానీ, లేదంటే ఆ తర్వాతి వారంలో కానీ భేటీ ఉండొచ్చని ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపేందుకు నెతన్యాహు శుక్రవారం ట్రంప్కు ఫోన్ చేశారని, ఈ సందర్భంగా త్వరలోనే అమెరికాలో భేటీ కావాలని ఇరు నేతలు అంగీకరించారని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ధ్రువీకరించింది.



