నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలోని అంకుశాపూర్ గ్రామంలో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జనగామ రాజేష్కు చెందినమూడు ఎకరాల గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రమదం సంభవించిందని స్థానికులు వెల్లడించారు. ఈ క్రమంలో వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమయానికి ఫైర్ ఇంజన్ చేరుకోవడంతో సమీపంలోని ఇతర పొలాలకు మంటలు వ్యాపించకుండా పెద్ద ప్రమాదం తప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. మూడు ఎకరాల గడ్డి పూర్తిగా కాలిపోవడంతో పశువులకు మేత కొరత ఏర్పడిందని బాధితుడు రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.30,000 మేర ఆస్తి నష్టం సంభవించిందని ఆయన వాపోయాడు. ప్రభుత్వం తనని ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.




