భారీగా ఆస్తి నష్టం
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-రాజేంద్రనగర్
ప్లైవుడ్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగి భారీగా ఆస్తి నష్టం సంభవించిన ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్లోని ప్లైవుడ్ గోదాంలో గురువారం ఉదయం నాలుగు గంటల సమయంలో గోదాంలో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గోదాంలో పెద్ద ఎత్తున ప్లైవుడ్ నిల్వలు ఉండటంతో మంటలు క్షణాల్లో ఆ ప్రాంతం మొత్తం వ్యాపించాయి.
గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. మంటలు ప్లైవుడ్ రెండు గోదాంలకు వ్యాపించి, ఆ ప్రాంతం మొత్తం పూర్తిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 5 ఫైర్ ఇంజన్ల సాయంతో సుమారు నాలుగు గంటలు కష్టపడి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో యజమానికి భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా..? మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



