Saturday, March 7, 2026
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో సీఎం ఛైర్‌గేమ్‌

బీహార్‌లో సీఎం ఛైర్‌గేమ్‌

- Advertisement -

బీజేపీ సర్కార్‌ ఏర్పాటుకు తలనొప్పి
రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా నితీశ్‌ నామినేషన్‌

పాట్నా: బీహార్‌లో తొలిసారి బీజేపీ సర్కార్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన నితీశ్‌కుమార్‌ రాజ్యసభకు వెళ్లనుండటంతో కమలం పార్టీకి మార్గం సుగమమైంది. అయితే బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడతారనే విషయమై చైర్‌గేమ్‌ నడుస్తోంది. సీఎం రేసులో బీహార్‌ ఉపముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, ఢిల్లీ, ఒడిశాలో మాదిరిగా అనూహ్యంగా కొత్తవారికి అవకాశం దక్కే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయమూ వినిపిస్తోంది.

బీహార్‌లో తమ ప్రభుత్వం ఏర్పడాలని బీజేపీ మదిలో.. నాలుగు నెలల నుంచే బీజం పడింది. సీఎంగా నితీశ్‌కుమార్‌ను మార్చటం తథ్యమనే విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి జేడీయూ కంటే బీజేపీయే ఎక్కువ స్థానాలు గెలుపొందింది. ఈ నేపథ్యంలో గతేడాది జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం పూర్తిగా కమలం పార్టీ కార్యక్రమంగానే సాగింది. అయితే ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్జేడీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు తేజస్వీయాదవ్‌, బీహార్‌లో బీజేపీ మహారాష్ట్ర తరహా రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. దళితులు, ఓబీసీలను వ్యతిరేకించే కమలం పార్టీ సామాజిక కోణంతో తన ఎజెండా అమలు చేయాలని చూస్తోందని విమర్శించారు.

బడుగు, బలహీన వర్గాలకే సీఎం పీటమంటూ ఊహాగానాలు
1990లో బీహార్‌ రాజకీయాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యానికి ముగింపు పలికిన మండల్‌ ఉద్యమంతోనే లాలూప్రసాద్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ కీలక నేతలుగా ఎదిగారు. ఇప్పుడు బీజేపీ కూడా సామాజిక వ్యూహంతోనే బడుగు, బలహీన వర్గాలకే సీఎం పీఠం కట్టబెట్టవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. బీహార్‌ ఉపముఖ్యమంత్రి, హోంశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సామ్రాట్‌ చౌదరి కోయెరీ- ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ వర్గానికి ఇప్పటివరకు సీఎం అయ్యే అవకాశం రాలేదు. ఆయనను పెద్ద నాయకుడిని చేస్తామని ఎన్నికల ప్రచారంలో అమిత్‌ షా ప్రకటించారు.

అయితే సామ్రాట్‌ చౌదరి ఆర్జేడీ నుంచి వచ్చి పదేండ్లు కూడా కాకపోవడంతో బీజేపీ అధినా యకత్వం ఆయనపై ఎంతవరకు విశ్వాసం చూపుతుందన్నది ఆసక్తి రేపుతోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రారు అయోధ్య ఉద్యమ సమయం నుంచి ఏబీవీపీలో, ఆరెస్సెస్‌లో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు. నిత్యానంద రాయ్ కు అవకాశం ఇస్తే అగ్రవర్ణాలు, నితీశ్‌ కుమార్‌ వర్గానికి చెందిన కుర్మీలు, ఇతర అత్యంత వెనుకబడి నవర్గాల నుంచి వ్యతిరేకత రావచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అర్హత ఆధారంగానే సీఎం అభ్యర్థిని ఎంపిక చేస్తామంటూ హైకమాండ్‌ లీకులు ఇస్తోంది. అయితే రేసులో ఉన్న వారికి ఇవ్వాలా.. లేక తమకు నచ్చిన వారిని సీఎంగా చేయాలా అన్నదానిపై ఢిల్లీ పెద్దల బుర్రలు వేడెక్కుతున్నాయి.

నితీశ్‌ కుమారుడికి డిప్యూటీ సీఎం!
బీజేపీ ఆధిపత్యంతో జేడీయూలో తమ ఉనికి పట్ల ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్‌ నేతల్లో ఆందోళన మొదలైంది. కుటుంబ రాజకీయాలను వ్యతిరేకించే నితీశ్‌ కుమార్‌ తన కుమారుడు నిశాంత్‌ను రెండురోజుల క్రితమే రాజకీయరంగ ప్రవేశం చేయించారు. ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇకపై నితీశ్‌ కుమారుడితో సహా తమ మంత్రులంతా పదవుల్లో కొనసా గాలంటే బీజేపీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిందేనని జేడీయూకు చెందిన ఓ సీనియర్‌ నేత ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -