నవతెలంగాణ-హైదరాబాద్: సుప్రీంకోర్టులో శుక్రవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ న్యాయమూర్తులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. చేతిలో ఉన్న కేసు పత్రాల కట్టను న్యాయమూర్తుల డయాస్ వైపు విసిరేయడంతో భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నేడు విచారణ సందర్భంగా స్వయంగా హాజరై తన వాదనలు వినిపించే క్రమంలో అసాధారణంగా దూకుడుగా ప్రవర్తించాడు. వాదనలు ప్రారంభించిన వెంటనే ‘లక్నో ఏసీపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నేను ఆదేశిస్తున్నా’ అంటూ న్యాయమూర్తులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. దీంతో ఆశ్చర్యానికి గురైన జస్టిస్ కేవీ విశ్వనాథన్.. ‘మీరు మమ్మల్ని ఆదేశిస్తున్నారా?’ అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన పిటిషనర్ ‘నా తరఫున చెప్పాల్సిందంతా చెప్పాను. అన్నీ రికార్డులో ఉన్నాయి’ అని పేర్కొన్నాడు. అనంతరం ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై కేసు పత్రాలను గాల్లోకి విసిరేయడంతో పాటు, కోర్టు హాలులోనే న్యాయమూర్తులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి పిటిషనర్ను అదుపులోకి తీసుకుని కోర్టు హాలు నుంచి బయటకు తరలించారు.


