నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా-పత్తి మిల్లులకు వెళ్లే రోడ్డు చాలా ఏండ్లుగా అధ్వానంగా ఉన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా వార్షాకాలం వచ్చిందంటే ఈ మార్గాన వెళ్లాలంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. గత పాలకులు ఈ రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదని స్థానిక సర్పంచ్ సంతోష్ మేస్త్రీ అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సహకారంతో ఎట్టకేలకు రూ.30 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అద్వాన స్థితి రోడ్డును ఎమ్మెల్యే ఒకే ఒకసారి చూడగానే ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా రూ.30 లక్షలు మంజూరు చేయించారని తెలిపారు. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కృషి మరువలేనిదని అన్నారు. ఈ క్రమంలో సర్పంచ్ పూజ చేసి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, సీసీ రోడ్డు గుత్తేదార్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండి గోపి, కేలూర్ సర్పంచ్ లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిలు, రచ్చ కుశాల్, పంచాయతీరాజ్ శాఖ ఏఈ అరుణ్, ఆ శాఖవర్క్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.



