– ‘ఉదారవాదానికి ఆవల’ వర్క్షాప్ ముగింపు సభలో ప్రభాత్ పట్నాయక్
గుంటూరు : వ్యక్తికి సంపూర్ణ స్వేచ్ఛ సోషలిజంలోనే సాధ్యమని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ అన్నారు. తన తాజా రచన ఉదారవాదానికి ఆవల (బియాండ్ లిబరలిజం) గ్రంథంపై మన మంచి పుస్తకం బృందం రెండు రోజులపాటు నిర్వహించిన వర్క్షాప్ ఆదివారం సాయంత్రం ముగిసింది. గుంటూరులో జరిగిన వర్క్షాప్లో ప్రభాత్ పట్నాయక్ ముగింపు ఉపన్యాసం చేశారు. సోషలిజం అంటే కేవలం ఉత్పత్తి శక్తులను అభివృద్ధి చేయటం, పెట్టుబడిదారీ విధానంతో పోటీ పడటం అనే ప్రాథమిక అవగాహన నుండి బయటపడాలని అన్నారు. సోవియట్ రష్యా పతనమైనంత మాత్రాన సోషలిజంపై విశ్వాసం కోల్పోవటం సరికాదని పేర్కొన్నారు. కనీసం 1970 దశకంలో ఉన్నంత బలంగా సోవియట్ రష్యా ఉన్నా నేడు ఇరాన్పైనా, వెనిజులాపైనా అమెరికా ఇంత బరితెగించి వ్యవహరించేది కాదని గుర్తుచేశారు. ఈ రెండు రోజుల వర్క్షాప్లో సభికులు వేసిన ప్రశ్నలకు ప్రభాత్ పట్నాయక్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రజాతంత్ర శక్తులు దేశంలో ఐదు సార్వత్రిక ఆర్థిక హక్కుల కోసం ప్రజా సమీకరణ చేయాలని పిలుపునిచ్చారు.
రెండు రోజుల వర్క్షాప్లో భాగంగా ఆర్థిక, తాత్విక రాజకీయ అంశాలు అనే గ్రంథంపై నలుగురు ప్రధాన వక్తలు ప్రసంగించారు. ‘సంప్రదాయ ఉదారవాదంలో వ్యక్తి స్థానం’ అంశంపై ఫ్రొఫెసర్ అంజిరెడ్డి మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థలో వ్యక్తి జీవితం సామాజిక జీవితంపై తీవ్రమైన ఒత్తిళ్లు ఉండేవని, ఈ ఒత్తిళ్లు లేని స్వేచ్ఛను ప్రసాదిస్తామంటూ పెట్టుబడిదారీ వ్యవస్థ ముందుకొచ్చిందని చెప్పారు.
‘కీన్సియన్ శ్రేయోరాజ్య భావన’ అంశంపై ఫ్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి మాట్లాడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థ కోరుకున్నట్లు పెట్టుబడికి అడ్డూ అదుపూ లేని స్వేచ్ఛ ఆచరణాత్మకం కాదని, వ్యవస్థను సంక్షోభాల బారి నుండి కాపాడలేదని అన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ నయా ఉదారవాదం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి నియంతృత్వ రాజ్యాలను ఆశ్రయిస్తోందని తెలిపారు. ప్రజలు సోషలిజం వైపు ఆకర్షితులు కాకుండా ఉండాలంటే సంక్షేమ రాజ్య భావనను విస్తరించాలని బేవరిడ్జ్ కమిటీ మొదలు అనేక సంస్థలు చేసిన సిఫార్సుల నేపథ్యంలో 1930 నుండి 1970 వరకూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడక తీరును విశ్లేషించాలని ఆయన అన్నారు. విశ్లేషకులు కొండూరి వీరయ్య మాట్లాడుతూ నయా ఉదారవాదం వ్యక్తి స్వేచ్ఛను ససేమిరా ఒప్పుకోదని అన్నారు. సోషలిస్టు దశలో ఆశించిన స్వేచ్ఛను సాధించే క్రమంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, ఎదురుదెబ్బల గురించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ జి.విజరు వివరించారు. వర్క్షాప్ చివరల్లో ఇరాన్పై అమెరికా దురాక్రమణను ఖండిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించారు. కార్యక్రమాన్ని మంచి పుస్తకం నిర్వాహకులు కాపు శ్రీనివాస్, కల్లూరి కృష్ణయ్య సమన్వయం చేశారు.
సోషలిజంలోనే సంపూర్ణ స్వేచ్ఛ
- Advertisement -
- Advertisement -



