నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కోచ్-ఫ్రాంచైజీ అనుబంధాల్లో ఒకటైన స్టీఫెన్ ఫ్లెమింగ్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్రయాణం ముగిసింది. దాదాపు 18 ఏళ్ల వారి సుదీర్ఘ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం నేడు అధికారికంగా ప్రకటించింది. ఫ్లెమింగ్, సీఎస్కే యాజమాన్యం మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఐపీఎల్లో ఒక సువర్ణ శకం ముగిసినట్లయింది.
2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్లో ఆటగాడిగా సీఎస్కేతో కలిసిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆ తర్వాతి ఏడాదే (2009) హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన మార్గనిర్దేశంలో సీఎస్కే ఫ్రాంచైజీ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫ్లెమింగ్ ఆధ్వర్యంలో చెన్నై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలు గెలుచుకుంది. రికార్డు స్థాయిలో 12 సార్లు ప్లేఆఫ్స్కు చేరడమే కాకుండా 10 సార్లు ఫైనల్లో ఆడింది.
ఈ నిర్ణయంపై సీఎస్కే యజమాని రూపా గురునాథ్ స్పందిస్తూ ఫ్లెమింగ్పై ప్రశంసలు కురిపించారు. “మా ఫ్రాంచైజీ ప్రయాణంలో దాదాపు ఆరంభం నుంచి స్టీఫెన్ ఫ్లెమింగ్ మా కోచింగ్ యూనిట్లో గుండెకాయలా నిలిచారు. రెండు దశాబ్దాలుగా మా గుర్తింపు, విజన్ను రూపొందించడంలో, ఉన్నత ప్రమాణాలను అందుకోవడంలో సహాయపడ్డారు. సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలోని ప్రతి ఒక్కరి తరపున ఆయన అచంచలమైన నిబద్ధత, అభిరుచి, నాయకత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మైదానంలో మా ప్రయాణం ముగిసినప్పటికీ, అతను ఎల్లప్పుడూ జట్టు వారసత్వంలో అంతర్భాగంగా ఉంటారు” అని ఆమె పేర్కొన్నారు.



