నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. బోనాలు కులాలకు అతీతంగా జరుపుకునే గొప్ప పండుగ అని కొనియాడారు.
సమైక్య రాష్ట్రంలో బోనాల పండుగను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, రాష్ట్ర పండుగగా గుర్తించలేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తుచేశారు. అమ్మవారి ఆశీస్సులతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గుడికి రూ.25 కోట్లు కేటాయించి, పండుగలను ఘనంగా నిర్వహించామని తెలిపారు.


