సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి
నవతెలంగాణ – నసురుల్లాబాద్
పరిసరాల పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ గ్రామాల్లో ఖాళీ ప్రదేశాల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా వెంటనే తొలగించాలని సూచించారు. అలాగే మురుగునీటి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చి పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు కూడా సహకరించాలని ఆమె తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని.. గ్రామాల్లో అధికారులు ప్రతిరోజు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆనంద్, ఎంపీవో సత్యనారాయణ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.



