చెన్నైలో తెలుగువారి ఘనకీర్తిని చాటుతూ శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది పండుగ రోజున ‘మహిళా రత్న’, ‘బాపు బొమ్మ’, ‘బాపు రమణ’, ‘విశిష్ట’ ఉగాది పురస్కారాలతో పాటు సినీ రంగం-2025 పురస్కారాలను ఈనెల 15న చెన్నైలోని మ్యూజిక్ అకాడమిలో విజేతలకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా జరగనున్న ఈ ఉగాది పురస్కారాలకు సంబంధించి వివరాలను చెబుతూ అవార్డు గ్రహీతల పేర్లను, అలాగే జరగనున్న కార్యక్రమ వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు, బేతిరెడ్డి శ్రీనివాస్, ప్రతివాది భయంకర ఫణీందర్, వేణు గోపాల్, అజయ్ కుమార్, జర్నలిస్ట్ కేశవ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఉగాది పురస్కారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా|| బ్రహ్మసాని చంద్రశేఖర్, విశిష్ట అతిథిగా ఎంవిఆర్ మురళీ కృష్ణ, గౌరవ అతిథులుగా ఎ.సాయి ప్రసాద్, సాహు గారపాటి, శశికాంత్ వల్లేపల్లి, ముబా పద్మయ్య, రాజమౌళి శీర్ణ, సరోజ వివేకానంద్ రానున్నారు. ప్రజా సేవ రంగంలో విశిష్ట ఉగాది పురస్కారాన్ని ఏపీ టూరిజం, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అందుకోనున్నారు. అలాగే మహిళా రత్న పురస్కారాన్ని మమత మాది రెడ్డి, అందెశ్రీ స్మారక పురస్కారాన్ని గీత రచయిత చంద్రబోస్, పీబీ శ్రీనివాస్ పురస్కారాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్కి అందజేయనున్నారు. ఉగాది పురస్కారాలు జాబితాలో ఉత్తమ చిత్రంగా ‘మిరాయ్’, ఉత్తమ సంచలన చిత్రంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఉత్తమ జ్యూరీ అవార్డు చిత్రంగా ‘డ్యూడ్’, ఉత్తమ నటుడిగా అక్కినేని నాగ చైతన్య, ఉత్తమ నటీమణిగా రష్మిక మందన్న, ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావిపూడి తదితరులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు.
శ్రీ కళా సుధ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు
- Advertisement -
- Advertisement -



