నౌకాయానంపై ఆంక్షలు
పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం
ప్రపంచ ఆహార ధరలకు రెక్కలు
స్వయం సమృద్ధిలేని దేశాలపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ : అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధోన్మాద చర్యలు ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తున్నాయి. ఇరాన్తో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేయడం, నౌకాయానంపై కఠిన నియంత్రణలు విధించడం జరిగితే ప్రపంచానికి కేవలం చమురు సంక్షోభమే కాదు.. ఎరువుల సంక్షోభం కూడా తలెత్తే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా పంటల దిగుబడులను ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. ఫలితంగా ఆహార ధరలు పెరగడానికి దారి తీసే అవకాశముందని వివరిస్తున్నారు. తాజా పరిణామాలు భారత్ పైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరిస్తున్నారు.
హార్ముజ్ జలసంధి ప్రాముఖ్యత
పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని ప్రపంచ మార్కెట్లతో కలిపే ప్రధాన సముద్ర మార్గం హార్ముజ్ జలసంధి. ప్రపంచంలో భారీగా చమురు, గ్యాస్ రవాణా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. అయితే ఈ మార్గం ద్వారా ప్రపంచంలో వ్యాపారం అయ్యే యూరియా ఎరువులలో దాదాపు మూడో వంతు కూడా రవాణా అవుతుంది. కాబట్టి ఇది ఇది కేవలం ఇంధన సరఫరాకే కాదు.. వ్యవసాయానికి కూడా కీలకంగా మారింది. అయితే హార్ముజ్ జలసంధిని మూసివేశారంటూ అనేక కథనాలు వెలువడినప్పటికీ.. ఇరాన్ ఆ వార్తలను కొట్టిపారేసింది. ఇరాన్ అధికారికంగా హార్ముజ్ను పూర్తిగా మూసివేయలేదు. కానీ యుద్ధ పరిస్థితుల వల్ల అక్కడి నౌకాయానం చాలా వరకు ఆగిపోయింది. చాలా షిప్పింగ్ కంపెనీలు ప్రయాణాలు ఆపేశాయి. బీమా కంపెనీలు యుద్ధ ప్రమాద బీమాను రద్దు చేశాయి. వందలాది నౌకలు బయటే వేచి ఉన్నాయి.
పంటలపై దీర్ఘకాల ప్రభావం
ఉత్తరార్థ గోళంలో రైతులు విత్తనాల ముందు ఎరువులను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. సరఫరా ఆలస్యం అయితే రైతులు మూడు మార్గాల్లో ఒక దానిని ఎంచుకోవాల్సి వస్తుంది. అధిక ధరలకు ఎరువులను కొనడం లేదా ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, పంటలను మార్చడం వంటివి చేయాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. కానీ నైట్రోజన్ వినియోగం కొంచెం తగ్గినా కూడా పంట దిగుబడులు భారీగా తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు, మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
గల్ఫ్పై ఆధారపడిన భారత్ సహా పలు దేశాలు
ప్రపంచంలోని అనేక దేశాలు పూర్తిగా స్వయం సమృద్ధిగా లేవని నిపుణులు చెప్తున్నారు. భారత్తో సహా అనేక దేశాలు చమురుతో పాటు ఎరువుల విషయంలో గల్ఫ్ దేశాలపై ఆధారపడి ఉన్నాయని వివరిస్తున్నారు. భారత్ గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఎల్ఎన్జీపై ఆధారపడి యూరియా ఉత్పత్తి చేస్తుంది. బ్రెజిల్ ఎరువులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. అమెరికా కూడా గల్ఫ్ దేశాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో హార్ముజ్ మార్గం మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆధునిక వ్యవసాయానికి దెబ్బ
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇది ఆధునిక వ్యవసాయాన్ని దెబ్బ తీసేలా కనిపిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఆధునిక వ్యవసాయం నేల, సూర్యకాంతి మీదే ఆధారపడదనీ, నైట్రోజన్ ఎరువులు పంటల దిగుబడికి కీలకమని నిపుణులు వివరిస్తున్నారు. 20వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు హేబర్-బోష్ పద్దతి ద్వారా సహజ వాయువును అమ్మోనియాగా మార్చే సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఆ అమ్మోనియాను యూరియా వంటి ఎరువులుగా తయారు చేస్తారు. ఈ ఎరువులతోనే గోధుమ, బియ్యం, మక్కజొన్న వంటి పంటలు అధిక దిగుమతులు ఇస్తున్నాయి. ఇవి లేకపోతే ప్రపంచ ఆహార ఉత్పత్తి భారీగా తగ్గిపోతుందని నిపుణులు చెప్తున్నారు.
ఎరువుల కేంద్రం ‘పర్షియన్ గల్ఫ్’
పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ఎరువుల తయారీలో కీలకంగా మారడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి.. ఇక్కడ లభించే చౌకైన సహజ వాయువు లభ్యత, భారీ పెట్టుబడులతో నిర్మించిన ఎరువుల కర్మాగారాలు. ఈ ప్రాంతంలో ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు పెద్ద ఎత్తున అమ్మోనియా, యూరియా ఉత్పత్తి చేసి ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నాయి.
ప్రపంచ ఆహార భద్రతకు కొత్త పరీక్ష
కొత్త ఎరువుల కర్మాగారాలను నిర్మించడానికి ఏండ్లు పడుతుంది. కాబట్టి గల్ఫ్ ప్రాంతం నుంచి ఎగుమతులు తగ్గితే తక్షణ ప్రత్యామ్నాయం ఉండదు. దీంతో ఆహార ధరలు పెరగడం, సరఫరా గొలుసులు దెబ్బతినడం, కొన్ని ప్రాంతాల్లో సామాజిక అసంతృప్తి పెరగడం వంటి పరిణమాలు సంభవించే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి హార్ముజ్ జలసంధి మూసివేత చమురు ధరలకు మాత్రమే కాదనీ, ప్రపంచ ఆహార భద్రతకు కూడా పెద్ద పరీక్షగా మారుతుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా పేద, అభివృద్ధి చెందిన దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు.
భారత్కూ భారమే..!
హార్ముజ్లో నౌకాయానం ఆగిపోతే భారత్పై దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా ఇంధనం, ఎరువుల సరఫరా ఈ మార్గంపై ఎక్కువగా ఆధారపడి ఉండటమే. భారత్ దిగుమతి చేసుకునే 85 శాతం చమురు అవసరాల్లో అధికం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. కాబట్టి భారత్లో పెట్రోల్, డీజీల్ ధరలకు రెక్కలొచ్చి అది ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఎల్ఎన్జీ (సహజ వాయువు)పై భారత్ ఆధారపడుతుంది. అలాగే కొంత భాగం ఎరువులను కూడా దిగుమతి చేసుకుంటుంది.
హార్ముజ్ మార్గం ఆగిపోతే ఎరువుల ధరలు పెరగడం, రైతులపై ఆదనపు భారం పడటం, పంటల ఉత్పత్తి పడిపోవడం జరుగుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. దీని ప్రభావం బియ్యం, గోధుమలు, ఇతర ధాన్యాలపై పడి వాటి ధరలూ పెరుగుతాయని వారు వివరిస్తున్నారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశముంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి హార్ముజ్ జలసంధి సంక్షోభం మధ్యప్రాచ్య యుద్ధ సమస్య మాత్రమే కాదనీ, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఆహార భద్రతకు పెద్ద సవాలు అని విశ్లేషకులు వివరిస్తున్నారు.
పెరుగుతున్న ఖర్చులు
హార్ముజ్ మూసివేతతో దాని ప్రభావం ఎరువులు, వాటి సరఫరాపై పడి.. అది వ్యవసాయ సంక్షోభానికి దారి తీయొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హార్ముజ్ జలసంధిలో నౌకాయానం ఆగిపోయినా, ఆలస్యమైనా అమ్మోనియా, యూరియా రవాణా ఆలస్యమ వుతుంది. ఎల్ఎన్జీ సర ఫరా దెబ్బ తింటుంది. రవాణా, బీమా ఖర్చులు పెరుగుతాయి. దీంతో ఎరువుల ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాద ముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉత్పత్తిపై ఎఫెక్ట్
ఎరువుల తయారీకి అవసరమైన నైట్రోజన్ ఉత్పత్తి పూర్తిగా సహజ వాయువుతో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే మొక్కల పెరుగుదలకు అవసరమైన సల్ఫర్ కూడా చమురు, గ్యాస్ ప్రాసెసింగ్ ద్వారా లభిస్తుంది. ఇలా ఇంధనం, ఎరువులు, ఆహారం అనేవి ఒకదానితో ఒకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ఇంధన సరఫరా దెబ్బతింటే ఎరువుల ఉత్పత్తి కూడా తగ్గిపోతుందని వెల్లడవుతున్నది.



