Wednesday, March 11, 2026
E-PAPER
Homeకరీంనగర్జనగణన పకడ్బందీగా పూర్తి చేయాలి

జనగణన పకడ్బందీగా పూర్తి చేయాలి

- Advertisement -

ప్రతి ప్రభుత్వ పథకానికి ఈ గణన కీలకం
రెండు దశల్లో జనగణన
కలెక్టర్ గరిమ అగ్రవాల్
జనగణన 2027పై చార్జ్ ఆఫీసర్లు, అదనపు చార్జ్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

జనగణన – 2027 ను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జనగణన 2027 పై సెన్సెస్ ఫర్ వెల్ఫేర్ పేరిట ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జిల్లా సమీకృత కార్యాలయం సముదాయంలో చార్జ్ ఆఫీసర్లు, అదనపు చార్జీ ఆఫీసర్లుకు శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. కలెక్టర్ హాజరై మాట్లాడారు. సెన్సెస్ చట్టం 1948 రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వం జన గణన చేపడుతుందని తెలిపారు. చార్జ్ ఆఫీసర్లుగా మున్సిపాలిటీలో కమిషనర్లు, మండలాల్లో తహసీల్దార్లు, అదనపు చార్జ్ ఆఫీసర్లుగా ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారని వెల్లడించారు. ఎన్యూమరేషన్ బ్లాక్ లో  దాదాపు 700 నుంచి 800 మంది ప్రజలు ఉంటారని తెలిపారు.


ఎన్యూమరేటర్, సూపర్ వైజర్లుగా ఉపాధ్యాయులను నియమించాలని సూచించారు. ఐదుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్ వైజర్ ఉంటారని తెలిపారు. ప్రతి మండలానికి ఒక టెక్నికల్ సహాయకులు ఉంటారని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో డిజిటల్ విధానంలో జరిగే మొదటి జనగణనని వెల్లడించారు. మొట్ట మొదటి స్వీయ జనగణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) అని వివరించారు. ఈ విధానంలో ప్రజలే తమ వివరాలు పోర్టల్ ద్వారా నమోదు చేసుకునే సదుపాయం ఉందని తెలిపారు.
జిల్లా ప్రధాన గణన అధికారిగా కలెక్టర్, జిల్లా అదనపు గణన అధికారిగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా గణన అధికారిగా శ్రీనివాసాచారి ఉంటారని తెలిపారు. మొదటి దశలో మే 11 వ తేదీ నుంచి జూన్ 09 వ తేదీ వరకు ఇండ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027 లో వ్యక్తుల వారిగా సమాచారం సేకరిస్తారని తెలిపారు.
రాజ్యాంగం ప్రకారం జనగణన అనేది చాలా కీలకమైన అంశమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను రూపకల్పనకు, వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు జనగణన చాలా ఉపయోగపడుతుందని తెలిపారు.

ఆరోగ్య, అక్షరాస్యత, జనాభా, లింగ నిష్పత్తి, వలసలు, ఉపాధి నివాస స్థితి తదితర అంశాల వివరాలు జనగణనతో ప్రభుత్వం వద్ద ఉంటాయని వెల్లడించారు. దీంతో ప్రతి ప్రభుత్వ పనికి సంబంధించి ఈ వివరాలు కీలకమని స్పష్టం చేశారు. జనగణనలో పాల్గొని అధికారులు బాధ్యతాయుతంగా తమ కేటాయించిన విధులను నిర్వర్తించాలని, వివరాలు పక్కాగా సేకరించి నమోదు చేయించాలని ఆదేశించారు. రోజువారి ప్లాన్ సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు. డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్ నుంచి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్స్ శ్రేయ, సుమిత్ర హాజరై శిక్షణ ఇచ్చారు. శిక్షణలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -