నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలో శనగ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం రైతులు పండించిన పంటను శనగ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించే రైతులకు నిరాశే ఎదురయింది. ఒకవైపు ఆకాశం మేఘావృతమై వర్షాలు పడే అవకాశం కనబడుతుండడంతో రైతులు తాము ఎండబెట్టిన శనగలను దళారులకు విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో నాలుగువేల ఎకరాలలో రైతులు శనగ పంట పండించగా, ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో వారు దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. ప్రభుత్వం శనగ కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.5800 ప్రకటించగా, ప్రస్తుతం దళారులు రూ.500 లకు క్వింటాలు శనగలను కొనుగోలు చేస్తున్నారని వారన్నారు. రైతులకు క్వింటాలకు రూ.800 నష్టపోవాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సెనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.



