నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన మక్క పంటకు సంబంధించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి లేఖ రాశారు. జిల్లాలో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మక్క పంట పండిందని, అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మక్కకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి) రూ.2400 ప్రకటించినప్పటికీ, కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్కు రూ.1700 నుంచి రూ.1800 వరకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
దీని వల్ల ప్రతి రైతు సగటున రూ.20,000 నుండి రూ.25,000 వరకు నష్టపోతున్నారని ఎంపీ తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి మక్కను మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆయన కోరారు. అలాగే రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి, మక్క కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి సూచించారు.



