పార్టీ రిజిస్ట్రేషన్ నిర్ణయం పట్ల ఈసీఐ జాప్యంపై ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్
ఈ వ్యవహారంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీఐకి కోర్టు ఆదేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మాజీ ఎంపీ కవిత దరఖాస్తు చేసుకున్న ‘తెలంగాణ ప్రజా జాగృతి’ (టీపీజే) పార్టీ నమోదు దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీఐ)ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవడంలో ఈసీఐ జాప్యం చేస్తుందని తెలంగాణ ప్రజా జాగృతి అధ్యక్షురాలిగా కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను గురువారం జస్టిస్ అమిత్ బన్సల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కవిత తరపున సీనియర్ అడ్వొకేట్ రిషి కుమార్ సింగ్ గౌతమ్, ఈసీఐ తరపున సీనియర్ న్యాయవాది సంజయ్ వశిష్ఠ్ హాజరయ్యారు. తొలుత రిషి కుమార్ వాదనలు వినిపిస్తూ… ప్రజా ప్రాతినిధ్య చట్టం -1951 కింద పార్టీ నమోదు కోసం జనవరి 23న ఈసీఐకి దరఖాస్తు చేసుకున్నట్టు కోర్టుకు నివేదించారు.
అవసరమైన అన్ని పత్రాలు, పార్టీ రాజ్యాంగం, నోటరైజ్డ్ అఫిడవిట్లు, 151 మంది సభ్యుల సభ్యత్వ జాబితా, సర్వ సబ్య సమావేశపు సమావేశాన్ని జరిగినట్లు చూపే మినిట్స్, ప్రత్యామ్నాయ పార్టీ పేర్లు, రిజిస్ట్రేషన్ కోసం నిర్ధేశిత రుసుము, రిజిస్ట్రేషన్ దరఖాస్తు పత్రాలను దాఖలు చేసినట్టు వివరించారు. ఈ దరఖాస్తు అందినట్టు జనవరి 27న ఈసీఐ ధవీకరించిందని తెలిపారు. అప్పటి నుంచి దరఖాస్తును పరిశీలించేందుకు ఈసీఐ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. ఈసీఐ జాప్యం ఏకపక్షమని, తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కవితకు నిరోధించడమే అవుతుందని వాదించారు. ఈసీఐ జాప్యం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29 ఏ అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తుందని, ఎన్నికల్లో పోటీ చేయాలనే పిటిషనర్ చట్టబద్ధ హక్కును కాలరాస్తుందని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం… కవిత దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశించింది. అలాగే ఈ పిటిషన్ పై విచారణను ముగిస్తున్నట్టు వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం స్పూర్తి నుంచే…
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన చారిత్రాత్మక స్వరాష్ట్ర సాధన ఉద్యమం స్పూర్తి నుంచే ‘తెలంగాణ ప్రజా జాగృతి’ (టీపీజే) పార్టీ ఆవిర్భవించిందని కవిత తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 19 న జరిగిన సర్వసభ్య సమావేశంలో పార్టీని ఏర్పాటు చేశామని, పార్టీ రాజ్యాంగాన్ని ఆమోదించారని, పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కార్యవర్గ సభ్యులకు అధికారం ఇచ్చారని పిటిషన్లో పొందుపరిచారు.
అయితే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రకియలో ఈసీఐ జాప్యం ఏకపక్షం, అసమంజసం అని ఆరోపించారు. ‘ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19(1)(సీ) లను ఉల్లంఘించడమే. ఈసీఐ ఎలాంటి పరిశీలన చేపట్టలేదు, ప్రజా ప్రకటనను ప్రచురించలేదు. అలాగే సెక్షన్ 29 ఏ(7) కింద విచారణకు అవకాశం ఇవ్వలేదు. ఎటువంటి వివరణ లేకుండా దరఖాస్తును పెండింగ్లో పెట్టింది’ అని పేర్కొన్నారు. అందువల్ల పార్టీ నమోదు ప్రక్రియ దరఖాస్తు మరింత ఆలస్యం కాకుండా ప్రాసెస్ చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశించాలని కోరారు.
రాష్ట్ర సాధన ఉద్యమం స్పూర్తి నుంచే ‘తెలంగాణ ప్రజా జాగృతి’
- Advertisement -
- Advertisement -



