నవతెలంగాణ – హైదరాబాద్ : మావోయిస్టు నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన మిసిర్ బేస్రా భద్రతా బలగాలకు చిక్కాడు. ఆయన తలపై రూ.1 కోటి రివార్డు ఉండడం గమనార్హం. ఝార్ఖండ్లో జరిగిన సంయుక్త ఆపరేషన్లో ఆయనతో పాటు మరో ఇద్దరు కీలక మావోయిస్టు నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు వ్యతిరేక పోరులో ఇది అత్యంత కీలక విజయాల్లో ఒకటిగా భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. అధికారుల వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి ఝార్ఖండ్ పోలీసులు, కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సీఆర్పీఎఫ్), కోబ్రా బెటాలియన్ సంయుక్తంగా ధన్బాద్, గిరిడిహ్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి.
మిసిర్ బేస్రా సంచారంపై అందిన నిఘా సమాచారంతో ఉచ్చు వేసిన బలగాలు ఆయన్ను అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఆపరేషన్లో మావోయిస్టు రీజినల్ కమిటీ సభ్యులు మెహనత్ అలియాస్ మొచ్చు, విభీషణ్ ముర్ము, గౌరవ్ అలియాస్ సౌరభ్లను కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరి తలపై చెరో రూ.15 లక్షల రివార్డు ఉంది. ఈ ముగ్గురితో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వారికి మావోయిస్టు సంస్థతో ఉన్న సంబంధాలపై విచారణ కొనసాగుతోంది.



