మూడు వారాల్లో రెండెకరాల్లోపు
మూడో విడతలో అందరికీ ఇచ్చేలా సన్నాహాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
యాసంగి రైతు భరోసా ఆదివారం రైతుల ఖాతాల్లో జమ కానుంది. రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ తొలి విడతలో రైతులందరికీ ఎకరానికి రూ.6 వేలు చొప్పున రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ కానుంది. తిరిగి 20 రోజుల తర్వాత రెండో విడతలో రెండు ఎకరాల్లోపు వరకు రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. అనంతరం 3వ విడతలో ఏప్రిల్ చివరి నాటికి రైతులకు ఎన్ని ఎకరాలున్నా అంత వరకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు సంబందించిన ఖాతాలు, నిధుల వివరాలను ట్రెజరీకి పంపించింది.
ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి వానాకాలం యాసంగికి కలిపి రూ.10 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకరానికి సంవత్సరానికి రూ.12 వేలు చొప్పున ఇస్తున్న విషయం విధితమే. గత యాసం గి సీజన్లో రైతులకు ఎకరానికి రూ.6 వేలు చొప్పున జనవరి 26, 2025న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసింది. కానీ ప్రస్తుతం యాసంగి సీజన్ ముగుస్తున్నప్పటికి రైతు భరోసా నిధులు జమ చేయలేదు.ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఈ నెల 22న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను సిద్దిపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.



