లక్ష్మీపురం స్కూల్ పనుల్లో వేగం పెంచండి
విద్యపై పెట్టే ప్రతి రూపాయి.. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడి
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ – బోనకల్
రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు కేవలం భవనాలు కావని, అవి రేపటి తరాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దే ‘దార్శనిక దేవాలయాలు’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభివర్ణించారు. విద్యకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధిలోని బోనకల్ మండల పరిధిలోని లక్ష్మీపురంలోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం పరిశీలించారు.
నాణ్యతతో.. వేగంగా పూర్తి చేయాలి
నాణ్యతతో వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ దశలో ఉన్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలలోని భవన సముదాయాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాలినడకన తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు. జూనియర్ హాస్టల్, జూనియర్, సీనియర్ విభాగాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మాణ ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు వేదికలుగా నిలిచే మెకానికల్, సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ ల్యాబ్ భవనాల పనులను ప్రత్యేకంగా పరిశీలించారు. పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా, నిబంధనల ప్రకారం అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. పనులను మరింత వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
ఆలోచనే ఒక పెట్టుబడి!
విద్య కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి.. కేవలం వ్యయం కాదు, అది రాబోయే భవిష్యత్ తరాలను శక్తివంతంగా నిర్మించడం కోసం పెట్టే అద్భుతమైన పెట్టుబడి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లక్ష్మీపురం స్కూల్ ఆవరణ అంతా తిరుగుతూ పనుల ప్రగతిని స్వయంగా అంచనా వేసిన డిప్యూటీ సీఎం. సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్, మెకానికల్ ల్యాబ్ భవనాల నిర్మాణ నాణ్యతపై అధికారులకు కీలక సూచనలు. గడువులోగా పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సదరు కాంట్రాక్టర్ కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, టి డబ్ల్యూ ఐ డి సి ఈఈ జనగాం బుగ్గయ్య, డి ఈ నాగేశ్వర చారి, మండల తహసిల్దార్ చల్లూరి సుధాకర్, ఏఈ బోయిన నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు పైడిపల్లి కిషోర్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కర్నాటి రామకోటేశ్వరరావు, గోవిందాపురం ఎల్, లక్ష్మీపురం సర్పంచులు మందా కరుణ, మర్రి సిలువ, ముష్టికుంట్ల సర్పంచ్ పిల్లలమర్రి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.



