- Advertisement -
- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవతెలంగాణ-వనపర్తి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచే విధంగా వైద్య అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ తన చాంబర్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ‘మిషన్ మధుమేహ దృష్టి’ కార్యక్రమం పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. అధికారులు ఇప్పటివరకు 12,000 మందికి పైగా ప్రజలకు స్క్రీనింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఏప్రిల్ నెలాఖరులోపు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ‘99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాల ద్వారా కంటి, దంత సమస్యలు ఉన్న పిల్లలకు తగిన చికిత్స అందించాలని సూచించారు. జిల్లాలో ప్రతి గర్భిణి మహిళను తప్పనిసరిగా నమోదు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల మెరుగుదలకు అవసరమైన సదుపాయాల కోసం సహకారం అందిస్తామని వైద్యులు మరింత కృషి చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిఎంహెచ్వో సాయినాథ్ రెడ్డి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ, ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



