– హెచ్ఆర్సీకి సీఐటీయూ ఫిిర్యాదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళనలు, పోరాటాలు చేస్తూ.. నిరసనలు తెలుపుతున్న కార్మికులపైన,వారి ఉద్యమాలపైన, నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నదనీ, ఇది నిరసన తెలిపే హక్కును హరించటమేనని సీఐటీయూ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు ఎస్వీ. రమ, కార్యదర్శులు ఎం. పద్మశ్రీ, కాసు మాధవి ు మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 16 నుండి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పలు యూనియన్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టాయని తెలిపారు. హైదరాబాద్ ధర్నా చౌక్లో ధర్నాలు చేపట్టేందుకు చలో హైదరాబాద్ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు పోలీసుల అనుమతి కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనుమతినివ్వలేదని తెలిపారు. పైగా అర్ధరాత్రి వచ్చి అనుమతిని నిరాకరిస్తున్నట్టు చెప్పి ఆయా యూనియన్ల నాయకులను, కార్మికులను ముందస్తు అరెస్ట్లు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్భంధిస్తున్నారని పేర్కొన్నారు.ఈ నెల 15న రాత్రి 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారితో పాటు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులను వరంగల్, కొమరం భీం జిల్లాల్లో మహిళా నాయకులను, కార్యకర్తలను రాత్రి వేళల్లో ఇంటి వద్ద అరెస్ట్ చేశారని తెలిపారు. మహిళలను రాత్రి పూట అరెస్టు చేయకూడదనే కనీస న్యాయాన్ని, చట్టాన్ని పాటించలేదని తెలిపారు. వారిని మహిళా పోలీస్ స్టేషన్లో కాకుండా సాధారణ పోలీస్ స్టేషన్లో నిర్భందించారని తెలిపారు. 16న శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంలో ర్యాలీని అడ్డుకుని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్తో పాటు ఇతర రాష్ట్ర నాయకులు, వందలాది మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను అరెస్టు చేసి, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారని పేర్కొన్నారు.సీఐటీయూ రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమను ముందస్తుగా గృహ నిర్బంధంలో ఉంచారని తెలిపారు. ఈ అంశాలపై మంగళవారం మానవ హక్కుల కమిషన్ కోర్టులో భాస్కర్ తమ వాదనలు వినిపించగా వచ్చే నెల నాలుగుకు కేసును వాయిదా వేశారు.
కార్మిక ఉద్యమాలపై నిర్బంధం ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



