నవతెలంగాణ – హైదరాబాద్: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని నవతెలంగాణ హెడ్ ఆఫీస్ ఎంహెచ్ భవన్లో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. నవతెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ పి. ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బుక్ హౌస్ ఎడిటర్ కె. ఆనందాచారి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా 10టీవీ మాజీ ఎండీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కులం, మతం, ప్రాంతం వంటి భేదాలు లేకుండా ప్రజలంతా ఐక్యంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో నేటి సమాజంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు, సామాజిక, సమానత్వం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.





