– యురేనియం దొరకలేదు, పాలనా మారలేదు
– ఇరాన్ విధ్వంసకర ప్రతిదాడికి ట్రంప్ తలొగ్గారా?
– నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్ : ఇరాన్, అమెరికా-ఇజ్రాయిల్ మధ్య యుద్ధంలో గంటల వ్యవధిలో వెలువడుతున్న సంకేతాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొద్ది గంటల్లోనే కాల్పుల విరమణ ప్రకటించేలా పరిస్థితి రూపుదిద్దుకుం టున్నట్టు కనిపిస్తోంది. ట్రంప్ తన ఏప్రిల్ 6వ తేదీ గడువుకు ముందే ఇరాన్పై దాడులను నిలిపి వేయవచ్చని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.
దీంతో ఈ యుద్ధంపై ట్రంప్ యూ-టర్న్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారా? అనే ప్రశ్న తలెత్తింది. పరిస్థితి మారుతున్న తీరు చూస్తుంటే, ఇరాన్ ప్రతిదాడి అమెరికాపై ఒత్తిడి తెచ్చిందనే అనుమానం కూడా కలుగుతోంది. ట్రంప్ ఇటీవలి ప్రకటనలు ఈ సంకేతాలనే సూచిస్తున్నాయి. ఈ యుద్ధం గరిష్టంగా రెండు లేదా మూడు వారాల్లో ముగుస్తుందని ఆయన అన్నారు.
అత్యంత దిగ్భ్రాంతికరంగా, హార్ముజ్ జలసంధి తెరుచుకున్నా, తెరుచుకోకపోయినా అమెరికా ఇరాన్ను విడిచిపెడుతుందని కూడా ఆయన అన్నారు. అదే సమయంలో ఉత్కంఠ కొనసాగు తోంది. ట్రంప్ గురువారం ఉదయం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచం మొత్తం గమనిస్తోందని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ ఈ సమాచారాన్ని అందించారు.
ట్రంప్ బుధవారం రాత్రి 9 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ 33 రోజుల యుద్ధాన్ని విశ్లేషిస్తే, అమెరికా, ఇజ్రాయిల్ తాము ప్రకటించుకున్న లక్ష్యాలను సాధించడంలో విఫలమయ్యాయి. ఈ యుద్ధానికి రెండు ప్రధాన లక్ష్యాలున్నాయి – ఇరాన్ నుంచి 440 కిలోల యురేనియంను స్వాధీనం చేసుకోవడం, పాలనలో మార్పు తీసుకురావడం.
ట్రంప్, నెతన్యాహు రెండు లక్ష్యాల్లోనూ విఫలమయ్యారు. ఐఆర్జీసీ మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భారీ దాడులు చేసింది. అంతేకాకుండా, హార్ముజ్ జలసంధిని నియంత్రించడం, ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించడం వంటివి చేసింది. ట్రంప్ అనేక బెదిరింపులు చేసినప్పటికీ, ఇరాన్ వెనకడుగు వేయలేదు.
ఇంతలో ట్రంప్ ఇస్ఫహాన్లోని ఆయుధ డిపోలపై 907 కిలోగ్రాముల బంకర్-బస్టర్ బాంబులను జారవిడిచారు. యుద్ధం నుంచి వైదొలగడానికి ముందు తమ బలాన్ని ప్రదర్శించేందుకే ఈ దాడి జరిగిందా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. అంతకుముందు హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరిస్తూ, ఏప్రిల్ 6వ తేదీలోగా అల్టిమేటం జారీ చేశారు ట్రంప్.
ఇప్పుడు ఆయన వైఖరి మారుతున్నట్టు కనిపిస్తోంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటన కూడా ఇదే సూచిస్తోంది. ఆయన, ”గమ్యాన్ని మనం చూడగలం. అది ఈరోజు కాదు, రేపు కాదు, అతి త్వరలోనే అవుతుంది” అని అన్నారు. ఇది అమెరికా యుద్ధ ముగింపు దిశగా పయనిస్తోందని స్పష్టంగా సూచిస్తోంది.
ఈ యుద్ధంలో అమెరికాకు దాని మిత్రదేశాల నుంచి కూడా మద్దతు లభించలేదు. బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇది తమ పోరాటం కాదని స్పష్టం చేశాయి. నాటో సభ్యదేశమైనప్పటికీ, టర్కీ మధ్యవర్తిత్వం వహించడానికి ఎంచుకుంది. బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ కూడా ఇది తమ యుద్ధం కాదని స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ పరిస్థితిలో, ట్రంప్ నాటో దేశాలపై బహిరంగంగా విరుచుకుపడ్డారు. మిత్రదేశాలకు చమురు అవసరమైతే, వారు హార్ముజ్ నుంచి తమ సొంత ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ఆయన అన్నారు. అమెరికా ఎల్లప్పుడూ తన మిత్రదేశాలకు అండగా నిలుస్తుందని, కానీ ఈసారి ఎవరూ వారికి అండగా నిలబడలేదని కూడా ఆయన విమర్శించారు. అమెరికా ఉక్రెయిన్కు సహాయం చేసినప్పటికీ ఇలా జరిగింది.
ఈ పరిణామాలన్నింటి మధ్య ఒక విషయం స్పష్టమవుతోంది. యుద్ధం నాలుగు వారాలకు పైగా కొనసాగుతోంది. కానీ ఎలాంటి ఫలితం లేదు. హార్ముజ్ జలసంధి సంక్షోభంలోనే ఉంది. ప్రపంచం ఇంధన సంక్షోభంతో సతమతమ వుతోంది. భారీ నష్టాలు వాటిల్లినప్పటికీ, ఇరాన్ యుద్ధంలో ధృఢంగా నిలబడింది. అందువల్ల, యుద్ధ, దౌత్య రంగాల్లో అమెరికా, ఇజ్రాయిల్లపై ఇరాన్దే పైచేయిగా ఉన్నట్టు కనిపిస్తోంది.
ట్రంప్ ఏం చెబుతారు?
అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణ ప్రకటిస్తారా? కొత్త గడువు ఇస్తారా? దీన్ని విజయంగా పేర్కొంటూ వైదొలగడానికి ప్రయత్నిస్తారా? లేక ఇరాన్ అణు కార్యక్రమంపై కొత్త షరతులు విధిస్తారా? మరోవైపు, ఇరాన్ వైఖరి స్పష్టంగా ఉంది. తమ దేశం సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. మా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడా నికి మేం వేయాల్సిన ప్రతి అడుగు వేస్తామన్నారు.
ప్రపంచంపై యుద్ధ ప్రభావం
యుద్ధం ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసింది. యూఎన్డీపీ నివేదిక ప్రకారం, మధ్యప్రాచ్య జీడీపీ 3.7 శాతం నుంచి 6 శాతం వరకు క్షీణించవచ్చు. నష్టాలు సుమారుగా రూ.18 లక్షల కోట్లుగా అంచనా వేయబడ్డాయి. హార్ముజ్ జలసంధి గుండా నౌకా రవాణా 70 శాతం తగ్గింది. చమురు ధరలు బ్యారెల్కు 120 డాలర్లకి చేరుకున్నాయి. 1.6 నుంచి 3.6 మిలియన్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి.



