– ప్రజా పాలనపై అవగాహన
– ఊట్లపల్లి సభలో పాల్గొన్న మండల ప్రత్యేకాధికారి
– మున్సిపాలిటీ 13 వ వార్డులో రేషన్ షాపు ప్రారంభం
నవతెలంగాణ – అశ్వారావుపేట : తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక) కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని పలు గ్రామపంచాయతీలు మరియు మున్సిపాలిటీ వార్డుల్లో గ్రామసభలు నిర్వహించారు. మండల పరిధిలోని ఊట్లపల్లి గ్రామసభలో మండల పరిషత్ ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్ పాల్గొని ప్రభుత్వ పథకాల అమలు తీరు, గ్రామ అభివృద్ధి ప్రణాళికలపై వివరించారు. మొద్దులమడలో ఎంపీడీవో అప్పారావు, రామన్నగూడెం గూడెంలో ఏపీవో రామచంద్రరావు సభల్లో పాల్గొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు గుర్రాల చెరువు ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు, కమిషనర్ బి. నాగరాజు, తహశీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ, ఎంఈవో ప్రసాదరావు, ఎన్పీడీసీఎల్ ఏడీఈ వెంకటరత్నం, సీఐ నాగరాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 13వ వార్డులో నూతన రేషన్ దుకాణాన్ని ప్రారంభించారు. గ్రామసభలు రాష్ట్ర జాతీయ గీతాలాపనతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల జాబితాలు మరియు త్వరలో ప్రవేశపెట్టబోయే కొత్త పథకాలపై అధికారులుచెప్పి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ గ్రామసభల్లో సర్పంచ్/చైర్పర్సన్, ఉప సర్పంచ్/వైస్ చైర్పర్సన్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, రైతులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు పథకాల లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలు, అవసరాలను గ్రామసభల ద్వారా తెలియజేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ ( బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు, అశ్వారావుపేట మాజీ సర్పంచ్ కొక్కెరపాటి పుల్లయ్య, తుమ్మ రాంబాబు, తాడేపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.



