నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. గతేడాది ఎనిమిది మంది కార్మికుల మృతికి కారణమైన అత్యంత ప్రమాదకరమైన షీర్ జోన్ను ఇంజినీర్లు విజయవంతంగా అధిగమించారు. దీంతో ఏడాదికి పైగా నిలిచిపోయిన పనులు ఇకపై వేగంగా ముందుకు సాగుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నల్లమల కొండల్లోని బలహీనమైన రాతి పొరలతో కూడిన ఈ షీర్ జోన్లోనే 2025 ఫిబ్రవరిలో సొరంగం కూలి టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) కూడా శిథిలాల కింద చిక్కుకుపోయింది. అప్పటి నుంచి పనులు నిలిచిపోయాయి. ఈ సవాలును అధిగమించేందుకు నిపుణులు అసలు మార్గాన్ని పక్కనపెట్టి, దానికి ఎడమవైపుగా కొత్త అలైన్మెంట్లో పనులు ప్రారంభించారు. టీబీఎంకు బదులుగా సురక్షితమైన డ్రిల్ అండ్ బ్లాస్ట్ పద్ధతిని ఎంచుకున్నారు. దీంతో ప్రమాదకర షీర్ జోన్ వెడల్పు 50 మీటర్ల నుంచి 10-14 మీటర్లకు తగ్గింది.
ఈ చిన్న భాగాన్ని దాటేందుకు సుమారు నెల రోజుల పాటు నిపుణులు అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. షీర్ జోన్లోకి ప్రవేశించే ముందు రాతి పొరల్లోకి స్టీల్ పైపులు పంపి గ్రౌటింగ్ చేసి పైకప్పు, గోడలను బలోపేతం చేశారు. చిన్న చిన్న భాగాలుగా పేలుళ్లు జరుపుతూ, వెంటనే రాక్ బోల్టులు, స్టీల్ గిర్డర్లతో పటిష్ఠం చేస్తూ ముందుకు సాగారు. కొత్త మార్గంలో ఇప్పటివరకు దాదాపు 150 మీటర్ల తవ్వకం పూర్తయింది.
“ప్రమాదకరమైన షీర్ జోన్ను దాటిన తర్వాత మాలో నమ్మకం పెరిగింది. ఇక నుంచి పనులు వేగంగా సాగుతాయి” అని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి డిప్యుటేషన్పై వచ్చిన టన్నెలింగ్ నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రా తెలిపారు. జైప్రకాష్ అసోసియేట్స్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణకుమార్ సతి మాట్లాడుతూ, “గతంలో భయం, ఆందోళన ఉండేవి. ఇప్పుడు ఆ భయం తొలగిపోయి పూర్తి నమ్మకం వచ్చింది” అన్నారు.
ఈ కీలక అడ్డంకిని దాటడంతో, దక్షిణ తెలంగాణలోని కరవు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు పనులు ఇక వేగవంతం అవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ కొత్త మార్గాన్ని పాత అలైన్మెంట్కు అనుసంధానించి పనులు కొనసాగిస్తారు.



