నవతెలంగాణ-హైదరాబాద్ : కుమారుడు విదేశాల్లో స్థిరపడ్డాడని సంతోషించిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. అతని ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని తెలుసుకుని మరింత కుంగిపోయారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ పరిధి శ్రీనివాసనగర్లో ఉంటున్న నాగభైరవ కృష్ణ, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు 2023లో అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. రెండో కుమారుడు సాయిప్రదీప్ (29) బీబీఏ చదివి నెలకు రూ.లక్షన్నర వేతనం వచ్చే ఉద్యోగం సంపాదించారు.
ఎంఎస్ చదవడానికి 2024లో అమెరికా వెళ్లి టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో సోదరుడితో కలిసి ఉంటున్నారు. ఉద్యోగం చేస్తుండగా పరిచయమైన సిద్దిపేట యువతికి సాయిప్రదీప్ ప్రేమిస్తున్నట్లు తెలపగా నిరాకరించిందని అతడి తండ్రి తెలిపారు. ఈ నెల 21న పలుమార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో ఆవేశంలో గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని రోదించారు. వారం తర్వాత మృతదేహం భారత్కు చేరుకోనున్నట్లు వెల్లడించారు. స్థానిక నాయకులు రామారావు, నరేందర్రెడ్డి, శ్రీకాంత్, హరిగౌడ్, తదితరులు సోమవారం ఆ కుటుంబాన్ని ఓదార్చారు.



