న్యూఢిల్లీ : రానున్న రక్షాబంధన్ పండుగ వేళ దేశవ్యాప్తంగా రాఖీ వ్యాపారాలు జోరందుకున్నాయి. ఈ ఏడాది కేవలం రాఖీ మార్కెట్టే సుమారు రూ. 25 వేల కోట్ల వ్యాపారాన్ని నమోదు చేయనుందని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) అంచనా వేసింది. స్వీట్లు, డ్రైఫ్రూట్స్, గిఫ్ట్స్, దుస్తులు, ఎలక్ట్రానిక్స్ వంటి ఇతర పండుగ అమ్మ కలతో కలిపి మొత్తం వ్యాపారం రూ. 30,000 కోట్లను దాటే అవకాశం ఉందని సిఎఐటి జాతీయ కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ వెల్లడించారు. ఒక్క దేశ రాజధాని ఢిల్లీలోనే దాదాపు రూ. 4,000 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు. చాందినీ చౌక్, సదర్ బజార్, కరోల్ బాగ్, లజపత్ నగర్, గాంధీ నగర్ వంటి ప్రముఖ మార్కెట్లలో కొనుగోలుదారులతో సందడి నెలకొంది. పండుగ సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయని వర్తక వర్గాలు పేర్కొంటున్నాయి.



