నవతెలంగాణ-హైదరాబాద్: అనర్హత పిటిషన్లపై రెబల్ టీఎంసీ ఎంపీలకు లోక్సభ సెక్రటేరియట్ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద 20మంది రెబల్ టిఎంసి ఎంపిలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ టిఎంసి నేత అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నోటీసులు జారీ అయ్యాయి. వారం రోజుల్లోగా ఆ నోటీసులపై సమాధానం ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నాయి.
ఆగస్టు 25 (మంగళవారం ) జారీ అయిన ఈ నోటీసులతో పాటు లోక్సభ సభ్యుల (ఫిరాయింపు కారణంగా అనర్హత) నిబంధనలు, 1985లోని రూల్ 6 కింద, త్రిపురకి చెందిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సిపిఐ)లో చేరిన ఎంపిలకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ జూన్ 18న దాఖలు చేసిన పిటిషన్ కాపీని కూడా జత చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అనర్హత పిటిషన్లపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహన్లతో కూడిన ధర్మాసనం అంగీకరించిన ఒకరోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.



