Saturday, April 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకులరహిత సమాజమే లక్ష్యంగా విమలారణదివే కృషి

కులరహిత సమాజమే లక్ష్యంగా విమలారణదివే కృషి

- Advertisement -

సీఐటీయూ ఆధ్వర్యంలో
విమలా రణదివే 111వ జయంతి
నవతెలంగాణ బ్యూరో-హైరాబాద్‌

కుల రహిత సమాజమే లక్ష్యంగా విమలారణదివే పని చేశారనీ, ఆమె కృషి ప్రస్తుత పరిస్థితుల్లో మరింత అనుసరణీయమని పలువురు వక్తలు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాల యంలో విమలారణదివే 111వ జయంతి కార్యక్ర మాన్ని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ అధ్యక్ష తన నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఎల్‌ఐసీ ఏజెంట్స్‌ ఆర్గనై జేషన్‌ ఆఫ్‌ ఇండియా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంజు నాధన్‌ పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం భాస్కర్‌ మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం గా పోరాడిన ధీర వనిత విమలా రణదివే అని కొనియాడారు. బీటీఆర్‌ వర్ధంతి నుండి అంబేద్కర్‌ జయంతి వరకు సీఐటీయూ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో సామాజిక న్యాయసాధన ప్రచార కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నామని తెలిపారు. వర్గ ఐక్యతకు ఆటంకంగా ఉన్న సామాజిక అంశాలను నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా పని చేయనున్నట్టు తెలిపారు. అందుకు స్ఫూర్తి బీటీఆర్‌, విమలా రణదివేనని చెప్పారు. దేశంలో విప్లవ సాధనకు, సమసమాజ నిర్మాణానికి వర్గ పోరాటంతో పాటు సామాజిక సమస్యలపై పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై బీటీఆర్‌ దిశా నిర్దేశాన్నిచ్చారని గుర్తు చేశారు. విమలా రణదివే క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారనీ, కార్మిక సంఘాలకు నాయకురాలుగా ఉండి ఆ వర్గాన్ని ఐక్యం చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. పని ప్రదేశాల్లో శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపులు రూపుమాపాలనే లక్ష్యంతో పనిచేశారన్నారు. శ్రామిక మహిళలను ప్రత్యేకంగా ఆర్గనైజ్‌ చేయాలని ఆమె వర్కింగ్‌ ఉమెన్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మంజునాథ్‌ మాట్లాడుతూ విమలా రణదివే, బిటి రణదివే ఇద్దరూ జీవితాన్నంతా ఉద్యమానికే అంకితం చేశారని తెలిపారు. వారు గొప్ప ఆదర్శ దంపతులని కొనియాడారు. మహారాష్ట్ర మారుమూల గ్రామాల నుండి అఖిల భారత స్థాయి వరకూ అనేక కార్మిక సంఘాలను నిర్మించి, పోరాటాలను నడిపి నేటీ కార్మికవర్గానికి మార్గదర్శకంగా నిలిచారని వివరించారు. ప్లాంటేషన్‌ కార్మిక సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, వర్కింగ్‌ ఉమెన్‌ సమస్యలపై అలుపెరగని పోరాటం నిర్వహించిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికవర్గం అనేక సవాళ్ళును ఎదుర్కొంటుందని, వాటిని తిప్పికోట్టేందుకు విమలా రణదివే స్ఫూర్తితో ఐక్యంగా పోరాటాలు చేయడమే ఆమెకు మనమిచ్చే నివాళి అని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ. రమ మట్లాడుతూ విమలా రణదివే తన చిన్నతనంలోనే బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, విదేశీ వస్త్రాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారనీ, ఆ క్రమంలో ఆరు నెల్లు జైలు శిక్షను అనుభవించారని తెలిపారు. ఉద్యమం చేయటం తప్పుని ఒప్పుకోవాలని బ్రిటిష్‌ పాలకులు ఒత్తిడి చేసినా వెనుదిరగని ధీరవనిత ఆమె అని కొనియాడారు. కలకత్తాలో కార్మిక సంఘాన్ని నిర్మించాలంటే అక్కడి భాషను నేర్చుకోవాలనే లక్ష్యంతో అందుకు తగిన సాధన చేశారని గుర్తు చేశారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా, వాయిస్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఉమెన్‌ పత్రిక ఎడిటర్‌, వర్కింగ్‌ ఉమెన్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ వ్యవస్థాపక కన్వీనర్‌గా అనేక కీలక బాధ్యతలను నిర్వహించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లిఖార్జున్‌, వి.ఎస్‌. రావు, రాష్ట్ర కార్యదుర్శులు కూరపాటి రమేష్‌, కాసు మాధవి, పుప్పాల శ్రీకాంత్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, ఎ. సునీత, వి. సందీప్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -