నవతెలంగాణ – కాటారం
ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానేత దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా కాటారం మండలంలో గౌరవప్రదంగా, భావోద్వేగభరితంగా స్థానిక నేతలు, అభిమానులు, ప్రజలు సోమవారం నివాళులర్పించారు. బస్వాపూర్ గ్రామంతో పాటు కాటారం కేంద్రంలో ఆయన విగ్రహాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. శ్రీపాదరావు ప్రజాసేవకు ప్రతిరూపంగా నిలిచిన మహానుభావుడని కొనియాడారు. ఆయన నాయకత్వం, దూరదృష్టి, ప్రజల పట్ల అపారమైన మమకారం మంథని ప్రాంత అభివృద్ధికి బలమైన పునాది వేసిందని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుండి పోరాడిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఆయన వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తూ ఆయన కుమారుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర మంత్రిగా ప్రజల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. అలాగే దుద్దిళ్ల శ్రీను బాబు కూడా కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని అభినందించారు.
శ్రీపాదరావు గారి ఆశయాలు, విలువలు నేటి తరానికి మార్గదర్శకమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలకు సేవ చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కర్తవ్యమని నాయకులు స్పష్టం చేశారు. సమాజాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మరింత కృషి చేస్తామని సంకల్పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు.



