– ఒకే టేబుల్ పై మాజీలు – తాజాలు
– సామాజిక సాన్నిహిత్యానికి అడ్డు రాని రాజకీయ వైరం
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం మోద్దులమడ గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో రాజకీయాలకు అతీతంగా సాన్నిహిత్యం కనిపించింది. కొండరెడ్డి గిరిజన రైతు చిప్పల బాబు రెడ్డి కుమారుని వివాహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు హాజరయ్యారు.
వివాహ విందులో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఇద్దరు మాజీలు, ఇద్దరు తాజా ప్రజాప్రతినిధులు ఒకే టేబుల్ వద్ద కూర్చొని సరదాగా ముచ్చటిస్తూ భోజనం చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి జలగం ప్రసాదరావుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా కొసరి కొసరిగా కూరలను వడ్డించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
గత రాజకీయ అనుభవాలను గుర్తుచేసుకుంటూ, నవ్వులు పంచుకుంటూ వారు స్నేహపూర్వకంగా గడిపారు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మైత్రులు ఉండవన్న నిజాన్ని ఈ సందర్భం మరోసారి ప్రతిబింబించింది.



