నవతెలంగాణ-హైదరాబాద్ : టర్కీలోని ఇస్తాంబుల్ తీరం మార్మరా సముద్రంలో ఘోర నౌకా ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో టర్కీ పతాకంతో ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక నౌకకు చెందిన 10 మంది సిబ్బందితో సంబంధాలు తెగిపోవడంతో వారి ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్ బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.
కొకేలీ నుంచి అలియాగా వెళ్తున్న ‘అల్సు’ (Alsu) అనే కెమికల్ ట్యాంకర్, ఇస్కెందరున్ ఓడరేవు నుంచి కరాడెనిజ్ ఎరెగ్లీ వైపు వెళ్తున్న ‘తుగ్బర్క్ ఇమామోగ్లు’ (Tugberk Imamoglu) అనే బల్క్ క్యారియర్ నౌకలు సిలివ్రి తీరానికి 18 నాటికల్ మైళ్ల దూరంలో ఢీకొన్నాయి.
ప్రమాదం జరిగిన అనంతరం ‘అల్సు’ నౌకకు ఎటువంటి తీవ్ర నష్టం జరగనప్పటికీ, ‘తుగ్బర్క్ ఇమామోగ్లు’ నౌకతో పాటు అందులోని 10 మంది సిబ్బంది ఆచూకీ పూర్తిగా లభ్యం కాకుండా పోయింది. అధికారులు వారి మొబైల్ ఫోన్లకు కాల్స్ చేసినా ఎలాంటి సమాధానం రాలేదు.మునిగిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సముద్ర ఉపరితలంపై నౌకకు చెందిన లైఫ్-సేవింగ్ జాకెట్లు, పరికరాలు కొట్టుకొచ్చినట్లు గుర్తించారు. ప్రమాద స్థలి వద్దకు 14 రెస్క్యూ నౌకలు, కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లను పంపి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.



