నవతెలంగాణ – హైదరాబాద్ : ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు 10 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం వెల్లడించారు. గత కొన్ని వారాలుగా రెండు దేశాల సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న క్రమంలో ఇది అరుదైన దౌత్య పురోగతిగా ఆయన అభివర్ణించారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో, ఇటు లెబనాన్ అధ్యక్షుడు జోసఫ్ ఆన్తో అద్భుతమైన సంభాషణలు జరిగినట్టు ట్రంప్ తెలిపారు. ‘కాల్పుల విరమణ 5 పీఎం ఈఎస్టీకి ప్రారంభమవుతుంది’ అని ఆయన ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా 9 యుద్ధాలను పరిష్కరించడం నాకు దక్కిన గౌరవం. ఇది 10వది. దీనిని కూడా విజయవంతం చేద్దాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందానికి ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. 1980ల తర్వాత ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగడం ఇదే తొలిసారి.
లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 2,000 మందికి పైగా మరణించగా, పది లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. కాగా, దక్షిణ లెబనాన్లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో 642 మంది భారత సైనికులు కూడా సేవలందిస్తున్నారు. ఈ కాల్పుల విరమణను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ స్వాగతించారు. ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.



