నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సౌత్ ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇప్పటివరకు ఆరుగురిని సహాయక బృందాలు సురక్షితంగా వెలికితీశాయి. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉన్నతస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కూలిపోయిన భవనం సుమారు 40-50 ఏళ్ల నాటిది. బేస్మెంట్తో కలిపి మొత్తం ఐదు అంతస్తులున్న ఈ భవనాన్ని పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంగా ఉపయోగిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. శిథిలాల కింద నుంచి వెలికితీసిన ఒక వ్యక్తిని ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా మాట్లాడుతూ, ఇది రాజకీయ విమర్శలు చేసే సమయం కానప్పటికీ, జవాబుదారీతనం ఎక్కడ అని ప్రశ్నించారు. “ఈ ప్రాంతంలో పీజీలు ఏ పరిస్థితుల్లో నడుస్తున్నాయో అందరికీ తెలుసు. వాటికి లేఅవుట్ ప్లాన్లను ఎవరు మంజూరు చేస్తున్నారు? అగ్నిమాపక భద్రతను ఎవరు ధ్రువీకరిస్తున్నారు? మున్సిపల్ కార్పొరేషన్, ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేల పాత్ర ఏమిటి? ఎవరో ఒకరు బాధ్యత వహించాలి” అని ఆయన నిలదీశారు. విద్యార్థులే శిథిలాల నుంచి ముగ్గురిని బయటకు లాగారని, ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘటనను అత్యంత విషాదకరమని అభివర్ణించారు. “ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీలో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇకనైనా నిద్రమత్తు వీడి పౌరుల భద్రతకు చర్యలు తీసుకోవాలి” అని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం అతిషి కూడా ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు డిమాండ్ చేశారు. నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావని ఆమె పేర్కొన్నారు.
సమీపంలోనే ప్రచారం చేస్తున్న ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖర్, తాము ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురిని కాపాడామని తెలిపారు. ప్రమాద స్థలంలో విద్యార్థులకు చెందిన పుస్తకాలు కనిపించాయని, ప్రభుత్వ వైఫల్యమే ఈ దుర్ఘటనకు కారణమని ఆరోపించారు.
ప్రమాదం జరిగిన భవనం పక్కనే ఉన్న పీజీలో నివసించే ఓ విద్యార్థి మాట్లాడుతూ, “భోజనం చేశాక ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు భవనం కంపించింది. బాల్కనీలోకి వచ్చి చూస్తే అంతా దుమ్ముతో నిండిపోయింది. కిందకు దిగాక భవనం కూలిందని అర్థమైంది. అధికారుల కంటే ముందే మేం ఒకరిని శిథిలాల నుంచి బయటకు లాగాం” అని తెలిపారు. మరో ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, ఇంకా 20-30 మంది శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.



