నవతెలంగాణ – హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్పై దుష్ప్రచారం చేసిన వారి చెంప చెళ్లుమనిపించేలా హైకోర్టు తీర్పు వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, ఈ తీర్పు ద్వారా కూలింది కాళేశ్వరం కాదని, కాంగ్రెస్ చేసిన కుట్రలు అని వ్యాఖ్యానించారు.
హైకోర్టు తీర్పుతో ఈరోజు గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కృషి చేసిన ఇంజినీర్లు అన్నారు. మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణలో పారుతున్న ప్రతి నీటిబొట్టు కేసీఆర్ చేసిన కృషివల్లే వచ్చిందని అన్నారు. తెలంగాణ భూమిపై గోదావరి పారినన్ని రోజులు కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరపలేరని అన్నారు.



