నవతెలంగాణ-హైదరాబాద్: ట్రేడ్ వార్ లో ఢీ అంటే ఢీ అని పోరాడిన అమెరికా-చైనా దేశాలు చర్చలతో శాంతించిన విషయం తెలిసిందే. ఇరుదేశాలు కూడా ప్రతీకార సుంకాలపై ఏకాభిప్రాయంతో ఆయా దేశాల దిగుమతులపై టారిఫ్లను తగ్గించుకున్నాయి. ఈనెల 9న లండన్ వేదికగా యూఎస్- బీజింగ్ మధ్య మరోసారి సుంకాలప ప్రతిపాదనపై కీలక చర్చలు జరగనున్నాయి. తమ దేశం తరఫున ట్రెజరీ మంత్రి స్కాట్ బెసెంట్, వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్, వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ పాల్గొంటారని ట్రంప్ వెల్లడించారు. అలాగే ఈ సమావేశం బాగా జరగాలని ఆయన ఆకాక్షించారు.
అయితే చైనా తరఫున ఎవరు హాజరుఅవుతారో తెలియాల్సి ఉంది. గురువారం చైనా అధినేత షీ జిన్పింగ్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ సుదీర్ఘ సంభాషణ సానుకూలంగా ముగిసిందని ట్రంప్ ప్రకటించారు. సుంకాలతోపాటు అరుదైన మూలకాల (రేర్ ఎర్త్ మినరల్స్) సరఫరా విషయంలో తలెత్తిన అవరోధాలను తొలగించే దిశగా త్వరలో రెండు దేశాల మధ్య చర్చలు సాగుతాయని వెల్లడించారు.
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో చైనాపై సుంకాలను 145 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 125 శాతం సుంకాలు విధించింది. ఆ తర్వాత ఇరుదేశాల ఒప్పందంతో ప్రతీకార సుంకాలను తగ్గించుకున్నాయి.