– ఇండ్ల స్థలాలు వెనక్కు తీసుకునేందుకు కుట్ర
– గ్రీన్ఫీల్డ్ హైవే.. యంగ్ ఇండియా స్కూల్ పేరుతో వెనక్కి!
– 3వేల మందికి పైగా జీవితాలతో చెలగాటం
– పేదల స్థలాల జోలికొస్తే ఊరుకోం: సీపీఐ(ఎం)
గరీబోళ్ల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయి. నాడు అభయ ‘హస్తం’ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రిక్త’హస్తం’ చూపుతోంది. పేదలకు ఇచ్చిన స్థలాలను గ్రీన్ఫీల్డ్ హైవే, యంగ్ ఇండియా స్కూల్ పేరుతో వెనక్కు తీసుకోవాలనే యోచనతో ఉంది. ఈ నేపథ్యంలో పేదల పక్షాన ‘సుత్తీ కొడవలి చుక్క’ వేగుచుక్కై పోరాడుతోంది.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఇండ్ల స్థలాల కోసం సీపీఐ(ఎం) సాగించిన పోరాటాల ఫలితంగా అనేక ప్రాంతాల్లో నిరుపేదలకు జాగాలు వచ్చాయి. ఖమ్మం నగరంలో వైఎస్ఆర్ కాలనీ, శివాయిగూడెం, రఘునాథ పాలెం మండల కేంద్రాల్లో పేదల కాలనీలు ఏర్పాటయ్యాయి. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో రఘునాథపాలెం రెవెన్యూ 218 సర్వే నంబర్లో 2వేల మందికి ఒక్కొక్కరికీ 75 గజాల చొప్పున ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు. 2018లో రీ సర్వే చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరుతో ఉన్న ఈ పట్టాలను మార్చి లబ్దిదారులను కుదించారు. తెలంగాణ ప్రభుత్వం పేరుతో 725 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చారు. అదే స్థలంలో ఇండ్లు నిర్మించుకునేందుకు కేసీఆర్ ఇంటి నిర్మాణం పేరుతో రూ.3లక్షలు ఇస్తామన్నారు. కొందరికి ఇంటి నిర్మాణానికి కావాల్సిన నగదు మంజూరు పత్రాలూ జారీచేశారు. తదనంతరం అధికారంలోకొచ్చిన కాంగ్రెస్.. పరిహారం లేకుండా ఈ స్థలాలను బై బ్యాక్ చేసుకునేందుకు పూనుకుంది. ఇదే జరిగితే ఇప్పటికే ఈ ప్లాట్లపై ఒక్కొక్కరూ రూ.లక్షకు పైగా వెచ్చించి చేపట్టిన నిర్మాణాలతోపాటు స్థలాలను కోల్పోతారు. మూడు వేల మందికి పైగా నిరుపేదల జీవితాలు రోడ్డున పడతాయి.
కాజేతకు కుట్ర
నాగపూర్ టూ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్ పేదల స్థలం నుంచి పోతోంది. దీని కింద 261 మందికి చెందిన ఇండ్ల ప్లాట్లు పోతున్నాయి. అది పోగా మిగిలిన ప్లాట్లలోనైనా ఇండ్లు నిర్మించుకుందామంటే.. రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా సమీకృత పాఠశాల కోసం 30 ఎకరాలు కేటాయిం చిందని.. స్థలం వెనక్కు తీసుకున్నామని అధికారులు చెబుతు న్నారు. ఇప్పటికే అనేక మంది పునాదులు తీసుకున్నారు. బేస్మెంట్ లెవల్లో కొన్ని ఇండ్లు ఉన్నాయి. ఒక్కొక్కరూ రూ.లక్షకు పైగా ఖర్చు పెట్టారు. ఇప్పుడా స్థలాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటం.. ఇండ్ల నిర్మాణాన్ని ఆటంకం పరుస్తుండటంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇంటి నిర్మాణ అనుమతి తెచ్చుకొని నిర్మించుకోవాలంటున్న అధికారులు.. పర్మీషన్ కోసం పోతే ‘పొమ్మన లేక పొగబెట్టినట్టూ..’ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. తగిన పరిహారం ఇవ్వాలని.. లేదంటే ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపాలని మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాధితులు మొరపెట్టుకున్నారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులకు అర్జీలు పెట్టారు. కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు. కానీ ఎవరూ వీరి గోడు వినే పరిస్థితి లేకపోవడంతో సీపీఐ(ఎం) అండగా నిలబడింది. అఖిలపక్షంతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశంతో మొదలైన ఈ ఆందోళనను మరింత తీవ్రం అవుతోంది.
కనికరం లేకుండా ఉన్నారు
కనీస సౌకర్యాలు కల్పించటం లేదు. రూ.వేలల్లో అద్దెలు చెల్లించలేక పోతున్నాం. ఇచ్చిన 75 గజాల్లో ఇంటి నిర్మాణం చేద్దామంటే నీరు, కరెంట్, రోడ్డు వంటి సౌకర్యాలు ఏవీ కల్పించకుండా మమ్మల్ని ఈ స్థలాల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బేస్మెంట్, గోడలు కట్టాం.. ఇప్పుడు ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్లాలి.
– సంగెపు చంద్రకళ, బాధితురాలు
ఇంటి అనుమతి ఇవ్వట్లేదు
అనుమతి తెచ్చుకొని ఇల్లు కట్టుకోవాలంటున్నారు. ఆర్డీవో పర్మీషన్ ఇవ్వట్లేదు. పట్టాలు ఇచ్చి ఏడేండ్లయినా ప్రభుత్వం మౌలిక సౌకర్యాలు ఏమీ కల్పించలేదు. మాకు ఎక్కడా సొంత ఇండ్లు కూడా లేవు. అద్దెకు ఉంటున్నాం. పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకుందామంటే అనుమతి ఇవ్వట్లేదు. ఇప్పటికే బేస్మెట్ వరకు నిర్మించాం. రూ.లక్షకు పైగా ఖర్చు వచ్చింది. ప్రభుత్వాలే ఇలా మాతో ఆడుకుంటే మా గోడు ఎవరికి చెప్పుకోవాలి.
– గోగుల రేణుక, బాధితురాలు
పేదల స్థలాల జోలికొస్తే ఊరుకోం..
పేదల స్థలాల జోలికొస్తే ఊరుకోం. ఎంతటి పోరాటా నికైనా వెనుకాడం. ఇప్పటికే మా పార్టీ ఆధ్వర్యంలో పోరాటం మొదలుపెట్టాం. అఖిలపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్తో కలిసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నాం. త్వరలో కలెక్టరేట్ను ముట్టడిస్తాం.
– ఎస్.నవీన్రెడ్డి, సీపీఐ(ఎం) రఘునాథపాలెం మండల కార్యదర్శి