గాజా, ఇరాన్పై ఇజ్రాయిల్ దాడులపై
కాంగ్రెస్ నేత సోనియా గాంధీ
న్యూఢిల్లీ: గాజా, ఇరాన్పై ఇజ్రాయిల్ సృష్టిస్తున్న మారణహౌమం పట్ల భారత్ మౌనంగా ఉండడాన్ని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తప్పుపట్టారు. భారత్ తన స్వరాన్ని కోల్పోవడమే కాదు, విలువల్ని సరెండర్ చేసినట్టు అవుతుందని ఆమె పేర్కొన్నారు. ద హిందూ ఆంగ్ల దినపత్రికలో సోనియా రాసిన వ్యాసాన్ని పబ్లిష్ చేశారు. ఇండియా తన స్వరాన్ని వినిపించేందుకు ఇంకా ఆలస్యం కాలేదన్న టైటిల్తో ఆమె ఆ ఐటమ్ రాశారు.
పాలస్తీనా, ఇజ్రాయిల్ అంశంపై గతంలో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయడంలో కేంద్రంలోని మోడీ సర్కారు విఫలమైనట్టు ఆమె పేర్కొన్నారు. భారత్ తన వైఖరిని స్పష్టం చేయడంలో ఆలస్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికైనా ఆలస్యం కాలేదనీ, భారత్ తన నిర్ణయాన్ని స్పష్టంగా తెలపటంతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు దౌత్యపరమైన చర్చలు చేపట్టాలని ఆమె తన వ్యాసంలో సూచించారు. పశ్చిమాసియా అంశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధ్వంసకర వైఖరిని ఖండించారు.