నవతెలంగాణ-హైదరాబాద్: చైనా వేదికగా షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రిత్వస్థాయి సదస్సులో భారత్ కు చేదు అనుభవం ఎదురైంది. సభ్యులంతా కలిసి చర్చించిన అంశాలపై వెలువడిన జాయింట్ డాక్యుమెంట్ లో పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఎలాంటి ఖండన లేకపోవడంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన సభ్యుల తీర్మాన పత్రాలపై సంతకం చేయడానికి నిరాకరించారు. దీంతో సంయుక్త ప్రకటనను రద్దు చేయాల్సి వచ్చింది.
చైనాలోని క్వింగ్డావోలో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రిత్వస్థాయి సదస్సు నిర్వహించారు. ఇందులో భారత్, చైనా, పాకిస్థాన్తో పాటు 10 సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు. సదస్సు అనంతరం రూపొందించిన జాయింట్ డాక్యుమెంట్.. ఉగ్రవాదంపై భారత కఠిన వైఖరిని సుస్పష్టంగా ప్రతిబింబించలేకపోయింది. అంతేగాక, ఈ ఏడాది ఏప్రిల్లో జమ్మూకశ్మీర్లో చోటుచేసుకున్న పహల్గాం ఉగ్రదాడి ఘటనను అందులో ప్రస్తావించలేదు. అదే సమయంలో బలోచిస్థాన్ అంశాన్ని చేర్చి భారత్ను నిందించే ప్రయత్నం జరిగింది.