Saturday, June 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎన్నికలు సకాలంలో ఎందుకు నిర్వహించలేదు?

ఎన్నికలు సకాలంలో ఎందుకు నిర్వహించలేదు?

- Advertisement -

– ఆరా తీసిన హైకోర్టు
– ఐఏఎంసీకి భూమి కేటాయింపు రద్దు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్‌ను హైకోర్టు కోరింది. మున్సిపల్‌ సంస్థల పాలకవర్గాలకు గడువు ముగిసిన ప్పటికీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో, ఎప్పుడు నిర్వహిస్తారో తెలియజేయాలని ఆదేశించింది. గత మార్చి 25న నిర్మల్‌ మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌లు చర్యలు తీసుకోవడం లేదంటూ అదే మున్సిపాల్టీలోని నటరాజ్‌నగర్‌కు చెందిన వ్యవసాయదారుడు సముందర్‌ పెల్లి రాజేందర్‌ వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ బి.విజరుసేన్‌రెడ్డి శుక్రవారం విచారించారు. ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకుని చెప్పేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణను జులై 11కి వాయిదా వేశారు.
ఐఏఎంసీకి భూమి కేటాయింపు రద్దు : హైకోర్టు తీర్పు
హైదరాబాద్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ)కి గతంలో 3.7 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. భూమిని కేటాయిస్తూ 2021లో వెలువడిన జీవోను రద్దు చేసింది. ఐఏఎంసీ నిర్వహణకు రూ.3 కోట్ల నిధులను కేటాయింపునకు వెలువడిన మూడు జీవోలను ఆమోదించింది ఐఏఎంసీకి 3.70 ఎకరాల భూమి, నిర్వహణ నిమిత్తం ఆర్థిక సాయంగా రూ. మూడు కోట్ల చెల్లింపులకు విడుదల చేసిన మూడు జీవోలను సవాల్‌ చేస్తూ దాఖలైన రెండు వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యంపౖౖె శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, జస్టిస్‌ కె.సుజనలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌లోని సర్వే 83/1లో 3.70 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో 126ను జారీ చేసింది. ఐఏఎంసీ నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఏటా రూ.3 కోట్ల నిధుల విడుదలకు సంబంధించిన జీవోలు 76, 6, 365ను కూడా జారీ చేసింది. వీటిని కొట్టేయాలంటూ అడ్వొకేట్లు వెంకట్రామిరెడ్డి, కోటి రఘునాథరావు వ్యక్తిగత హాదాలో పిల్స్‌ వేశారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో.. ల్యాండ్‌ రెవెన్యూ రూల్స్‌ 1975 నిబంధనను ప్రభుత్వం ఉల్లంఘించి భూకేటాయింపు చేసింది, ఐఏఎంసీ కంపెనీల చట్టం కింద నమోదు కాలేదు. దీని ప్రకారం కూడా భూకేటాయింపు చెల్లదు. ప్రభుత్వ భూమిని ప్రయివేట్‌ సంస్థకు ఉచితంగా బదిలీ చేయడానికి వీల్లేదు. నిధుల కేటాయింపు సబబే. అయితే, ఆ నిధుల కేటాయింపులను ఐదేండ్ల తర్వాత కూడా కొనసాగించే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేయాలి. నిధుల కేటాయింపు చేస్తున్నప్పటికీ ఐఏఎంసీ పనితీరు సంతృప్తికరంగా లేదు. గత 4 సంవత్సరాలు ఐఏఎంసీ పని తీరు ఆశాజనకంగా లేదు. ఇందుకు కేసుల పరిష్కార లెక్కలే నిదర్శనం. గత జనవరి నాటికి 15 ఆర్బిట్రేషన్‌ కేసులను నిర్వహిస్తే అందులో 11, మీడియేషన్‌ కేసులు 57కిగాను 17 చొప్పున కొలిక్కి వచ్చాయి. దీనికితోడు ఐఏఎంసీ ట్రస్ట్‌ బోర్డు తమ ఆస్తులను విక్రయించేందుకు వీలుగా నిబంధన 6(డి) చేర్చడం తీవ్రమైన విషయం. ఇలాంటి నిబంధన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఖరీదైన ప్రాంతంలో 3.7 ఎకరాలను ఉచితంగా ఇవ్వడం చెల్లదు. ప్రభుత్వం నుంచి ప్రయివేటు సంస్థ అయిన ఐఏఎంసీ శాశ్వత ప్రాతిపదికపై ఆర్థిక సాయం పొందకూడదు. ఐదేండ్ల తర్వాత ఆర్థిక సాయం కొనసాగించాలో లేదో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆలోచన చేయాలి.. అని కోర్టు చెప్పింది. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.సత్యంరెడ్డి వాదిస్తూ, కోట్ల రూపాయల విలువైన 3.70 ఎకరాల ప్రభుత్వ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఐఏఎంసీకి కేటాయించడం దారుణం. దీనివల్ల రాష్ట్రానికి తీరని నష్టం. ప్రయివేటు ట్రస్ట్‌కు నిబంధనలకు విరుద్ధంగా నిధులను కేటాయించడమేగాకుండా నిర్వహణకు నిధులు కేటాయించడం ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని న్యాయవాదులు వాదించారు. ఐఏఎంసీ తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ, ప్రజాప్రయోజనాల కోసమే ప్రభుత్వం భూమి/నిధులు ఇచ్చిందన్నారు. రాష్ట్రం ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకుంటే.. కోర్టులపై కేసుల భారం తగ్గుతుందని, ఇందులో ప్రజాహితం ఉన్నందునే ప్రభుత్వం భూమి/నిధులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుందన్నారు. కోర్టులపై కేసుల పెండెన్సీ తగ్గించేందుకు ప్రత్యామ్నాయ పరిష్కార వివాదానికి ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఐఏఎంసీ ట్రస్ట్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయశాఖ మంత్రితోపాటు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు ట్రస్టీలుగా ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం కేటాయించిన నిధుల్లోఒక్క రూపాయి దుర్వినియోగం కాలేదన్నారు. ఈ విధంగా గత జనవరి 28న జరిగిన తుది వాదనల తర్వాత పిటిషన్లను అనుమతిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
జస్టిస్‌ రాధారాణికి హైకోర్టు వీడ్కోలు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.రాధారాణి పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఫస్ట్‌ కోర్టు హాల్లో వీడ్కోలు సమావేశం జరిగింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోరు పాల్‌ అధ్యక్షతన న్యాయమూర్తులు సమావేశమయ్యారు. ఆమె సేవల్ని ఏసీజే కొనియాడారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి , అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ నర్సింహ శర్మ, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు, బార్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌ఏ.నరసింహారెడ్డి, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్‌, తేరా రజనీకాంత్‌రెడ్డి, హైకోర్టు అడ్వొకేట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏఏ) అధ్యక్షుడు జగన్‌, సిబ్బంది పాల్గొన్నారు. జస్టిస్‌ రాధారాణి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -