నవతెలంగాణ-హైదరాబాద్: త్రిభాషా విధానంలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం హిందీని రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. పాఠశాలల్లో హిందీ భాషను కచ్చితంగా చదివించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ భాషను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం తీసుకోనున్న ఈ నిర్ణయాన్ని ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా వచ్చే నెల జూలై 5న ప్రతిపక్ష పార్టీలన్నీ నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనల్లో ఎన్సిపి (ఎస్సిపి), మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్), శివసేన (యుబిటి) నేతలు పాల్గొనున్నట్లు ఎన్సిపి (ఎస్సిపి) పార్టీ నేత సుప్రియా సూలే శనివారం మీడియాకు వెల్లడించారు.
ఈ విషయంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో హిందీని బలవంతంగా రుద్దడమనేది మాకు చాలా ముఖ్యమైన సామాజిక సమస్య. రాజకీయ సమస్య కాదు. భాషా విద్య అనేది చాలా తీవ్రంగా పరిగణించవలసిన విషయం. నిపుణుల మార్గదర్శకత్వంతో మేము ముందుకు సాగుతాము. మరే ఇతర రాష్ట్రం కూడా ఈ విధంగా చర్యలు తీసుకోలేదు. మహారాష్ట్ర ప్రభుత్వమే ఎందు ఇంత పట్టుదలగా వ్యవహరిస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఒకరిని సంతోషపెట్టడానికి పిల్లల భవిష్యత్తును పాడుచేయలేము. జూలై 5న ర్యాలీ జరుగుతుంది. ఈ మార్చ్లో ఎన్సిపి పార్టీ పాల్గొంటుంది. విద్య అనేది మనకు చాలా తీవ్రమైన సమస్య. దీనిపై పోరాడతాము’ అని ఆమె అన్నారు.
కాగా, హిందీ భాషకు వ్యతిరేకంగా శివసేన (యుబిటి) నేత సంజరు రౌత్ వ్యతిరేకించారు. ‘మేము ఏ భాషకు వ్యతిరేకం కాదు. హిందీని మేము ఎల్లప్పుడూ గౌరవిస్తాము. మా పార్టీ కూడా అనేక విధాలుగా హిందీని ఉపయోగిస్తుంది. కానీ త్రిభాషా విధానం కింద 4వ తరగతి వరకు మూడవ భాషను హిందీని తప్పనిసరి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పిల్లలపై అనవసరమైన భారాన్ని మోపుతుంది. ఇది విద్యాపరమైన భాషాపరమైన సమస్య. అన్నీ పార్టీలు కలిసి ఈ సమస్యపై నిరసనలు చేయనున్నాయి. శివసేన (యుబిటి), ఎంఎన్ఎస్ జూలై 6,7 తేదీల్లో వేర్వేరుగా నిరసనలు చేయనున్నాయి. జూలై 5న అన్నీ పార్టీలు ఉమ్మడిగా నిరసనలకు పిలుపునిచ్చాయి’ అని ఆయన అన్నారు.