Sunday, June 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమూడేండ్లలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు

మూడేండ్లలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు

- Advertisement -

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– ఆయిల్‌ పామ్‌ మెగా ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటిన మంత్రి
నవతెలంగాణ-చేవెళ్ల

రైతు సంతృప్తిగా ఉన్నప్పుడే రాజ్యం బాగుపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాబోయే మూడేండ్లలో 10లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్టు తెలిపారు. శనివారం ఆయిల్‌ పామ్‌ మెగా ప్లాంటేషన్‌లో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్‌ పరిధిలోని దేవుని ఎర్రవల్లిలో రైతు, పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ చింపుల సత్యనారాయణ రెడ్డి పొలంలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దేశంలో 12 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు ఉంటే.. ఏపీలో 6 లక్షల ఎకరాలు, తెలంగాణలో 3లక్షల ఎకరాల్లో సాగైందని చెప్పారు. ఆయిల్‌ పామ్‌ సాగు కోసం 12.20 ఎకరాలకు 90 శాతం సబ్సిడీపై డ్రిప్‌ ఇస్తున్నామని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఎన్ని ఎకరాలు సాగుచేసినా ఇస్తామని హామీ ఇచ్చారు. రైతుకు మొక్కల దగ్గర నుంచి మార్కెటింగ్‌ దాకా ప్రభుత్వం సహకరిస్తున్నదని తెలిపారు. ప్రతి జిల్లాకూ ఆయిల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిద్దిపేటలో రిఫైనరీ, ప్యాకింగ్‌ సహా అతి పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామనీ, ఈ ఫ్యాక్టరీలన్నీ ఫ్రీ పొల్యూషన్‌తో ఉంటాయని స్పష్టం చేశారు. పశ్చిమ రంగారెడ్డి ప్రాంతంలో కూరగాయలు ఎక్కువగా పండిస్తున్నందున, హైదరాబాద్‌కు దగ్గరగా మార్కెట్‌ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు అధిక ఆదాయం ఉన్న పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులందరికీ రాయితీపై బిందు సేద్యం పరికరాలు అందజేస్తామని తెలిపారు. జిల్లాలో మెగా ఆయిల్‌ ప్లాంటేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఈ ఒక్క రోజే 557 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటుతున్నట్టు చెప్పారు. జంట నగరాల ప్రజల అవసరాలకు అనుగుణంగా రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు పండించాలని కోరారు. అనంతరం ఆయిల్‌ పామ్‌ మొక్కలను నాటి రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌ రాయల నాగేశ్వరరావు, హార్టికల్చర్‌ శాఖ డైరెక్టర్‌ యాస్మిన్‌ బాషా, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ పెంటయ్యగౌడ్‌, సర్దార్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మెన్లు గోనె ప్రతాప్‌రెడ్డి, దేవర వెంకట్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మెన్‌ బేగరి రాముడు, మండల అధ్యక్షులు వీరేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -