Monday, June 30, 2025
E-PAPER
Homeజాతీయంవిశాఖ భూములపై పతంజలి కన్ను!

విశాఖ భూములపై పతంజలి కన్ను!

- Advertisement -

– శారదాపీఠానికి ఇచ్చిన భూములు కట్టబెట్టే యత్నం
– ప్రభుత్వ స్థాయిలో కదులుతున్న ఫైళ్లు
– యోగా సెంటర్‌ పేరిట ఏపీ ప్రభుత్వ భూములకు గాలం
– బాబాలు, స్వాములకు ప్రభుత్వ భూముల బదలాయింపు తగదు : ఇఎఎస్‌.శర్మ
విశాఖ:
పాలకులు మారినా విధానాల్లో ఏ మార్పూ రాలేదనడానికి విశాఖ జిల్లాలో ప్రభుత్వ భూములను స్వాములు, బాబాలకు కట్టబెట్టే ఉదంతాలే ప్రత్యక్ష తార్కాణం. వ్యాపారాల్లో ఆరితేరిన పతంజలి సంస్థ అధిపతి, ఆధ్యాత్మిక యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాకు విశాఖ జిల్లాలో టూరిజం, యోగా వెల్‌నెస్‌ సెంటర్ల స్థాపన పేరుతో రూ.వందల కోట్ల విలువైన భూములను కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాకు చెందిన రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం మూడు రోజుల క్రితం రామ్‌దేవ్‌ బాబా విశాఖ జిల్లా పర్యటనలో భాగస్వాములవుతూ భూములు ఎక్కడ కావాలో చెప్పండంటూ కోరడం విస్మయం కలిగించే అంశం.
విశాఖ జిల్లా భీమునిపట్నం ఏరియాలో స్వాములు, బాబాలకు ప్రభుత్వం భూములు కట్టబెట్టే పనులు చకచకా సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు, పొరపాట్లను సరిదిద్ది వ్యవస్థలను నిలబెడతామంటూ చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు అవే తప్పులను పదేపదే చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో శారదాపీఠం (స్వరూపానంద స్వామి)కు సుమారు రూ.220 కోట్లకుపైగా విలువ చేసే 15 ఎకరాలను కట్టబెట్టారు. ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ జీఓలను రద్దు చేసి ఇప్పుడు మరో బాబాకు దాసోహం అంటోంది. దేశంలో పలుచోట్ల కంపెనీల కోసమని భూములను తీసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న ‘పతంజలి’ ఉత్పత్తుల అధినేత రామ్‌దేవ్‌ బాబాకు భీమిలిలో 15 ఎకరాలను కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైందన్నది స్పష్టమవుతోంది. శారదాపీఠానికి నాడు కేటాయించిన 15 ఎకరాలపై రామ్‌దేవ్‌ బాబా ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది.

గతంలో జరిగిందే.. నేడూ రిపీట్‌
శారదాపీఠానికి భీమిలి మండలం కొత్తవలస గ్రామంలో సర్వే నెంబర్‌ 102/2లో 7.30 ఎకరాలు, సర్వే నెంబర్‌ 103లో 7.3 ఎకరాలను సంస్కృతిక పాఠశాల, వేదిక్‌ ఎడ్యుకేషన్‌ కోసమని గత ప్రభుత్వం ఎకరాను రూ.లక్షకు ధారాదత్తం చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం ఆ జిఒలను రద్దు చేసింది. ప్రభుత్వ భూములను ప్రయివేట్‌ సంస్థలకు ఇవ్వకూడదని జీఓ ఎంఎస్‌ నెంబర్‌ 571/2012 సెప్టెంబర్‌ 14లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ తప్పనిసరి అయితే అటువంటి భూముల విషయంలో ప్రయివేట్‌ సంస్థ నుంచి సంవత్సరానికి భూమి మార్కెట్‌ ధర మీద కనీసం పది శాతం లీజు రెంటు వసూలు చేయాల్సి ఉంది. కొత్తవలసలో రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ విభాగం నిర్ణయించిన ధరల ఆధారంగా మార్కెట్‌ ధర ఎకరానికి రూ.1.2 కోట్లు ఉంది. కనీసం ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా నాటి ప్రభుత్వం చౌకగా శారదాపీఠానికి భూములను కేటాయించింది. నేడు కూటమి ప్రభుత్వమూ ఆ దారిలోనే వెళ్తోంది.

ప్రభుత్వం నుంచి అలాంటి సమాచారం లేదు
‘భీమిలి మండలంలో రామ్‌దేవ్‌ బాబాకు స్థల కేటాయింపుల విషయమై ప్రభుత్వం నుంచి ఇంతవరకూ మాకు ఎలాంటి సమాచారమూ రాలేదు’ అని విశాఖ జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ మీడియాకు తెలిపారు. – విశాఖ జేసీ

సుప్రీం కోర్టు తీర్పు ఉల్లంఘన
సుప్రీంకోర్టు 2011 జనవరి 28న జగపాల్‌ సింగ్‌ కేసులో ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాలి. ప్రయివేట్‌ సంస్థలకు బదలాయించకూడదు. ఇటీవల ఓ ప్రయివేటు సంస్థ అధినేత భీమిలిలో అధికారులతో కలిసి పర్యటించి భూముల అన్వేషణ సాగించడం తీవ్ర ఆక్షేపణీయం.
– రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఇఎఎస్‌.శర్మ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -