– రూ.800 కోట్లతో కార్పస్ ఫండ్
– పెన్షనర్లతో కలిపి 6లక్షల మందికి ప్రయోజనం
– పక్కదారి పట్టకుండా పక్కాగా నిబంధనలు
– తుది దశకు చేరిన విధివిధానాల కసరత్తు
– జులై చివరికల్లా పట్టాలెక్కనున్న పథకం
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్సనర్ల కోసం కొత్త ఆరోగ్య పథకానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వాస్పత్రులతో పాటు గుర్తించిన ప్రయివేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చెల్లుబాటయ్యేలా క్యాష్లెస్ వైద్య సేవలు అందించేందుకు ఎంప్లాయిస్ హెల్త్ ట్రస్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం సమాన భాగస్వామ్యంతో రూ.800 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు. గతంలో జరిగిన అవకతవకలు పునరావృతం కాకుండా పటిష్టమైన విధివిధానాలను రూపొందిస్తున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే జులై చివరి వరకు ఈ పథకం ఉద్యోగులకు అందుబాటులోకి రానుంది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 3,69,200 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2,88,000 మంది పెన్షనర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరికి ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) పథకం ద్వారా ప్రభుత్వాస్పత్రులతో పాటు గుర్తించిన ప్రయివేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుతు న్నాయి. నోటిఫై చేసిన ప్రయివేట్ ఆస్పత్రుల్లో తమకు కావాల్సిన వైద్యం అందుబాటులో లేకపోవడం, తదితర కారణాలతో ఇతర ప్రయివేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేసుకునేందుకు ఉద్యోగులకు అవకాశం కల్పించారు. వైద్యానికి అయిన ఖర్చులకు సంబంధించిన బిల్లులు మెడికల్ రీయింబర్స్ మెంట్ కింద చేసుకుంటే, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం వైద్యుల ప్యానెల్ వాటిని సర్టిఫై చేస్తారు. అ తర్వాత ప్రభుత్వం వాటిని చెల్లిస్తుంది. ఈహెచ్ఎస్తో పాటు రియింబర్స్మెంట్ చెల్లింపుల్లో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో బీఆర్ఎస్ సర్కార్ రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకం కింద ఆస్పత్రులకు నిధుల చెలింపులపై అనేక ఆంక్షలు పెట్టింది. దాంతో వారు ఉద్యోగులకు వైద్య సేవలు అందించడం లేదు. సొంత డబ్బులు పెట్టి వైద్యం చేసుకుంటే రియింబర్స్మెంట్లో కోతలు, ఏండ్ల తరబడి పడిగాపులు, ప్రయివేట్ రంగంలో గుర్తించిన కార్పొరేట్ ఆస్పత్రులు హెల్త్ కార్డులు తీసుకొని వెళితే వాటిని చెత్తబుట్టలో వేసేంత పని చేస్తున్నారు. దీంతో గత ఐదారేండ్ల నుంచి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆజమా యిషిలో నడుస్తున్న ఒక్క నిమ్స్లో మాత్రమే ఉద్యోగులు, జర్నలిస్టులకు ఈ పథకం కింద వైద్య సేవలు అందుతున్నాయి.
జులైలో అందుబాటులోకి..
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (ఈహెచ్సీటీ)ని ఏర్పాటు చేసింది. ట్రస్టుకు ఉద్యోగులు ప్రతి నెలా రూ.500 చెల్లిస్తారు. అంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఏడాదిలో ఉద్యోగులు రూ.400 కోట్లు, సర్కార్ రూ.400 కోట్లు కలిపి మొత్తం దాదాపు రూ.800 కోట్లు జమ అవుతాయని భావిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించేందుకు ఉపయోగించనున్నారు. గరిష్టంగాఎంత మొత్తాన్ని వైద్య సేవల కోసం చెల్లించాలనే దానిపై ఇటీవల ఉద్యోగ సంఘాలతో సర్కార్ చర్చించింది. రూ.20 లక్షల వరకు గరిష్టంగా చెల్లించాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ క్రమంలో రూ.10 లక్షలకు కటాఫ్ పెట్టాలనీ, అంతకు మించి ఖర్చయితే ట్రస్ట్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకునేలా ప్రభుత్వం విధివిధానాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
ఉద్యోగులకు ఎంతో మేలు : వి.లచ్చిరెడ్డి, చైర్మెన్ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న నూతన ఆరోగ్య పథకం ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది చిన్న ఉద్యోగులు, పెన్షనర్లు మెరుగైన వైద్య సేవలను అందుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వరంగల్ జిల్లా నల్లబెల్లి డిప్యూటీ తహశీల్దార్ రాజేశ్ఖన్నా తీవ్ర ఆనారోగ్యం పాలై హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం రూ.13 లక్షలు వెచ్చించారు. అయినా ఇంకా రూ.7 లక్షలు చెల్లిస్తేనే డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం ముప్పుతిప్పలు పెట్టింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే నూతన ఆరోగ్య పథకానికి ప్రభుత్వాన్ని ఒప్పించాం. దీని వల్ల ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని భావిస్తున్నాం.